logo

వస్తోంది... మరో వైద్య కళాశాల

ఉమ్మడి జిల్లాలో మరో వైద్య కళాశాల అందుబాటులోకి వచ్చింది. రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) నుంచి అనుమతులొచ్చాయి.

Published : 02 Jun 2023 04:54 IST

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం

రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రి ప్రధాన భవనం

ఉమ్మడి జిల్లాలో మరో వైద్య కళాశాల అందుబాటులోకి వచ్చింది. రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) నుంచి అనుమతులొచ్చాయి. ఈ మేరకు సమాచారం (లెటర్‌ ఆఫ్‌ అండర్‌ టేకెన్‌) గురువారం ఆసుపత్రి అధికారులకు అందింది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి 150 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో జిల్లా వాసులతోపాటు కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని పలు ప్రాంతాల వాసులకు మెరుగైన విస్తృత వైద్యసేవలందనున్నాయి. వైద్య కళాశాల స్ట్రక్చర్‌ ప్రకారం సూపర్‌ స్పెషాలిటీ సేవలు నిరుపేదలకు లభిస్తాయి.

రాజమహేంద్రవరం జిల్లా వైద్యశాలగా ఉన్న సమయంలో ఇక్కడి ఆసుపత్రికి సుమారు వెయ్యి వరకు ఓపీ ఉండేది. ప్రస్తుతం అది 1,200 నుంచి 1,400 వరకు పెరిగింది. సర్వజన ఆసుపత్రిగా మారిన తరువాత 22 రకాల వైద్య విభాగాలు ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చాయి.  అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ వంటి విభాగాలు వైద్య విద్యార్థులకు బోధనాపరంగా అందుబాటులోకి వచ్చాయి. ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ వల్ల పోస్టుమార్టంలో న్యాయపరమైన చిక్కులు లేకుండా కచ్చితత్వంతో కూడిన ఫలితాలు ఇచ్చేందుకు వీలుంటుంది. బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పెథాలజీ విభాగాల ద్వారా ఇదివరకు ఇక్కడ లేని సాధారణ రక్త పరీక్షలతోపాటు కల్చర్‌, బోన్‌ మ్యారో, బయాప్సీ వంటి అత్యాధునిక పరీక్షలన్నీ అందుబాటులోకి వచ్చాయి.

పెరగనున్న పడకలు..

ఆసుపత్రి ప్రస్తుతం 350 పడకలతో సేవలందిస్తోంది. వైద్య కళాశాలగా మారిన నేపథ్యంలో మొదటి ఏడాదికి 400, మూడేళ్లకు 500, అయిదేళ్లకు 600 పడకలతో వైద్యం అందించే వీలుంటుంది.

అయిదేళ్లలో అత్యున్నతం

బోధనాసుపత్రి మూడేళ్లు పూర్తయ్యే సరికి సూపర్‌ స్పెషాలిటీ విభాగానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.  అయిదేళ్లలో ఒక బ్యాచ్‌ బయటికొచ్చేసరికి పేదలకు అన్ని రకాల సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చి మేలు జరుగుతుంది. మూడేళ్లలోపు నర్సింగ్‌ కళాశాల ప్రారంభమై వారి సేవలు సైతం త్వరితగతిన అందుబాటులోకి వస్తే మరింత మేలు చేకూరుతుంది.

రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యకళాశాల

ఆగస్టు నుంచి తొలి బ్యాచ్‌

వైద్య కళాశాలకు అనుమతులు ఇస్తున్నట్లు లేఖను (లెటర్‌ ఆఫ్‌ అండర్‌ టేకెన్‌) ఎన్‌ఎంసీ మంజూరు చేసింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి తొలి బ్యాచ్‌ విద్యార్థులతో చదువులు ప్రారంభమవుతాయి. మరో వారం రోజుల్లో లెటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌ వస్తుంది.  

డాక్టర్‌ ఆర్‌.రమేష్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని