TSPSC ప్రశ్నపత్రం లీకేజీ.. రూ.1.63 కోట్ల లావాదేవీలు: సిట్‌

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్‌ అధికారులు నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు రూ.1.63 కోట్ల లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలినట్లు పేర్కొన్నారు.  

Updated : 09 Jun 2023 16:34 IST

హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.ఈ కేసులో ఇప్పటివరకు రూ.1.63 కోట్ల లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే నిందితులకు సంబంధించిన ఖాతా వివరాలు, చేతుల మారిన నగదు వివరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరికొంత మందిని అరెస్టు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.

ఈ కేసులో ఇప్పటివరకు 49 మందిని సిట్‌ అధికారులు అరెస్టు చేయగా.. వీరిలో 16మంది మధ్యవర్తులుగా ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసిన మరో నిందితుడు ప్రశాంత్‌ న్యూజిలాండ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఏఈఈ ప్రశ్నపత్రం లీకైన తర్వాత 13 మందికి, డీఏవో పేపర్‌ 8మందికి, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నలుగురికి చేరాయని గుర్తించినట్లు తెలిపారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌ చేరిన నలుగురిలో టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురు ఉద్యోగులు ఉండగా.. మరో వ్యక్తి బయటివాడని తేల్చినట్లు వివరించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో దశలోనే ఉన్నట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

ఇటీవల అరెస్టయిన డీఈ పూల రమేష్‌ సహకారంతో ఏఈఈ, డీఏవో పరీక్షల్లో చూచిరాతకు పాల్పడిన ముగ్గుర్ని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలను రామంతాపూర్‌లోని సెంట్రల్‌ ఫోరెనిక్స్‌ సైన్స్‌ లాబోరేటరికి పంపించినట్లు తెలిపారు. వాటిని విశ్లేషిస్తున్న క్రమంలో మరికొంత సమాచారం బయటికి వచ్చినట్లు వెల్లడించారు. డీఈ రమేష్‌ ఏఈఈ ప్రశ్నపత్రాన్ని మరికొంత మందికి విక్రయించినట్లు సిట్‌ అధికారులు భావిస్తున్నామని చెప్పారు. దీన్ని బట్టి ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. తర్వాత కేసు దర్యాప్తులో తేలే మిగతా నిందితులను బట్టి అనుబంధ అభియోగపత్రం దాఖలు చేయాలని భావిస్తున్నట్లు సిట్‌ అధికారులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని