logo

Hyderabad: ప్రియుడి సాయంతో భర్తను చంపి కట్టుకథ

ఆ దంపతులు జీవనోపాధి వెతుక్కుంటూ  హైదరాబాద్‌ వచ్చారు. భర్త  స్నేహితుడికి ఆమె దగ్గరై ఆ కుటుంబం ఛిద్రం కావడానికి కారణమైంది. ఈ క్రమంలో భర్త ప్రాణాలు కోల్పోగా, భార్య జైలు పాలైంది.

Updated : 23 Oct 2023 08:41 IST

శవపరీక్ష నివేదికలో గుట్టు రట్టు

లత

కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: ఆ దంపతులు జీవనోపాధి వెతుక్కుంటూ హైదరాబాద్‌ వచ్చారు. భర్త స్నేహితుడికి ఆమె దగ్గరై ఆ కుటుంబం ఛిద్రం కావడానికి కారణమైంది. ఈ క్రమంలో భర్త ప్రాణాలు కోల్పోగా, భార్య జైలు పాలైంది. పిల్లలు తల్లిదండ్రుల అండ లేనివారయ్యారు. కేపీహెచ్‌బీ పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పరిధి గుండ్లరేవుకి చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ భూక్యా మహేశ్‌కి అదే జిల్లా పాల్వంచ మండలం కరకవాగుకు చెందిన లతతో వివాహమైంది. వీరికి ఓ బాబు, పాప. మహేశ్‌కి రెండుసార్లు పక్షవాతం వచ్చింది. ఈ దంపతులు 6 నెలల కిందట కేపీహెచ్‌బీ హైదర్‌నగర్‌ పరిధి రామ్‌నరేశ్‌ నగర్‌కి వచ్చారు. విక్రమ్‌ అనే మరో క్యాబ్‌ డ్రైవర్‌ని నమ్మి మహేశ్‌ రెండుసార్లు ఇంటికి తీసుకురాగా అతను లతకు చేరువయ్యాడు. చివరకు మహేశ్‌ను హతమార్చే వరకు ఆ బంధం వెళ్లింది. మహేశ్‌ను కుర్చీలో కూర్చోబెట్టి ఉరి పెట్టారు. తరువాత భర్త మూర్ఛతో మృతి చెందినట్లు చుట్టుపక్కల వారిని నమ్మించింది. ఇంటి యజమాని దగ్గర్లోని వైద్యుడిని పిలిపించడం, అప్పటికింకా మహేశ్‌ నాడి కొట్టుకుంటూ ఉండడంతో  గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జూన్‌ 23న మహేశ్‌ మృతి చెందాడు. శవపరీక్షలో మహేశ్‌ది సహజ మరణం కాదని, ఉరివేసి చంపినట్లు నమోదైంది. దీంతో పోలీసులు లత(23)ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు కథ చెప్పింది. పరారీలో ఉన్న విక్రమ్‌ కోసం గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని