logo

ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకొని.. పిస్తోల్‌ తెప్పించుకొని!

ఫేస్‌బుక్‌ పరిచయం అతన్ని పిస్తోల్‌ తీసుకొచ్చేలా చేసింది. అక్రమంగా ఆయుధాలను విక్రయించి రూ.లక్షలు సంపాదించాలనుకున్న అతడు బాలానగర్‌ ఎస్వోటీ, జీడిమెట్ల పోలీసులకు చిక్కాడు.

Published : 03 May 2024 06:58 IST

వాహనాల తనిఖీల్లో దొరికిన లిఫ్ట్‌ టెక్నీషియన్‌

పోలీసులు స్వాధీనం చేసుకున్న పిస్తోల్‌, బుల్లెట్లు, సెల్‌ఫోన్‌

జీడిమెట్ల: ఫేస్‌బుక్‌ పరిచయం అతన్ని పిస్తోల్‌ తీసుకొచ్చేలా చేసింది. అక్రమంగా ఆయుధాలను విక్రయించి రూ.లక్షలు సంపాదించాలనుకున్న అతడు బాలానగర్‌ ఎస్వోటీ, జీడిమెట్ల పోలీసులకు చిక్కాడు. జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల అయోధ్యనగర్‌కు చెందిన వంశీకృష్ణగౌడ్‌ లిఫ్ట్‌ టెక్నీషియన్‌గా పనిచేసేవాడు. ఏడాది క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా మధ్యప్రదేశ్‌కు చెందిన విశాల్‌యాదవ్‌ పరిచయమయ్యాడు. ఈ క్రమంలో తన వద్ద ఆయుధాలు ఉన్నాయని, విక్రయిస్తానని విశాల్‌యాదవ్‌ చెప్పాడు. హైదరాబాద్‌లో డిమాండ్‌ ఉంటుందని చెప్పడంతో తనకు ఓ పిస్తోల్‌ కావాలని వంశీకృష్ణగౌడ్‌ అడిగాడు. అందుకు రూ.50 వేలకు ఒప్పందం చేసుకున్నారు. తొలుత ఫోన్‌పే ద్వారా రూ.19 వేలు చెల్లించాడు.  మార్చి 6న ఖాజీపేట రైల్వేస్టేషన్‌ వద్దకు పిస్తోల్‌ తీసుకొచ్చినట్లు అతను చెప్పాడు. వంశీకృష్ణగౌడ్‌ బైక్‌పై అక్కడికెళ్లి మిగతా డబ్బు ఇచ్చి పిస్తోల్‌ తీసుకొని అయోధ్యనగర్‌కు వచ్చాడు. ఎవరు కొనుగోలు చేస్తారని ఆరా తీయడం మొదలుపెట్టాడు. బుధవారం సాయంత్రం అయోధ్యనగర్‌ నుంచి వెళ్తుండగా చింతల్‌లో పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా   ఆపారు. సోదా చేయగా బైక్‌లో పిస్తోల్‌ కనిపించింది. దాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని