logo

నిజామాబాద్‌ను గుండెల్లో పెట్టుకుంటా

‘‘ నేను గులాబీ జెండా ఎత్తిన నాడు.. నిజామాబాద్‌ నా వెంట నిలిచి జిల్లా పరిషత్తును గెలిపించింది.

Updated : 07 May 2024 05:59 IST

కార్నర్‌ మీటింగ్‌లో గులాబీ దళపతి కేసీఆర్‌

ప్రసంగిస్తున్న మాజీ సీఎం కేసీఆర్‌, హాజరైన ప్రజలు

ఈనాడు, నిజామాబాద్‌, న్యూస్‌టుడే, నిజామాబాద్‌ అర్బన్‌ : ‘‘ నేను గులాబీ జెండా ఎత్తిన నాడు.. నిజామాబాద్‌ నా వెంట నిలిచి జిల్లా పరిషత్తును గెలిపించింది. ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తింది. ఈ విషయాన్ని నేను ప్రాణం ఉన్నంత వరకు మరవను.  ఈ ప్రాంతాన్ని గుండెల్లో పెట్టుకుంటాను’’ అని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం నిజామాబాద్‌లో నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నెహ్రూ పార్క్‌ చౌరస్తాలో జరిపిన కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగించారు. ఆరు గ్యారంటీలంటూ హామీలిచ్చిన కాంగ్రెస్‌..వాటిని అమలు చేయటం లేదని మండిపడ్డారు. అవి అమలు కావాలంటే.. ప్రభుత్వం మెడలు వంచి .పోరాటం చేసేందుకు భారాస అభ్యర్థిని గెలిపించాలన్నారు నిజామాబాద్‌లో గత ఎన్నికల్లో భాజపా ఎంపీని గెలిపించారని..ఆయన వల్ల ఇక్కడ ఏం లాభం జరగలేదని విమర్శించారు.  తమది సెక్యులర్‌ విధానమన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి 20 శాతం ఓట్లు మాత్రమే వస్తున్నాయని.. ముస్లింలు ఆ పార్టీకి ఓటేస్తే భాజపా లాభపడుతుందన్నారు. పులిలాంటి గోవర్ధన్‌ను గెలిపించాలని చెప్పారు. తెల్లారితే విద్వేషాలు రెచ్చగొట్టే భాజపాకు ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. బస్సుయాత్రగా నిజామాబాద్‌కు చేరుకున్న భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కంఠేశ్వర్‌ బైపాస్‌ రోడ్డు వద్ద మహిళలు మంగళహారులతో స్వాగతం చెప్పారు. పాత కలెక్టరేట్‌ కూడలి నుంచి ర్యాలీ ప్రారంభమైంది. నెహ్రూ పార్క్‌ చౌరస్తా వరకు సాగింది. బస్సులో నుంచే కేసీఆర్‌ ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం నెహ్రూ పార్క్‌ కూడలిలో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌కు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు. కేసీఆర్‌ తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రసంగించారు.  

 జిల్లా నేతలతో కేసీఆర్‌ సమావేశం  

జగిత్యాల : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జగిత్యాల రోడ్‌షోలో పాల్గొన్న భారాస అధినేత కేసీఆర్‌ రాత్రి ఎమ్మెల్సీ ఎల్‌.రమణ నివాసంలో బస చేశారు. సోమవారం రోజంతా అక్కడే ఉన్న కేసీఆర్‌ నాయకులతో సమావేశమయ్యారు. నిజామాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌, రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేష్‌రెడ్డి, భారాస జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ వసంత, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, ఎమ్మెల్యేలు డాక్టర్‌ ఎం.సంజయ్‌కుమార్‌, డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌, మాజీమంత్రి జి.రాజేశంగౌడ్‌, తదితరులతో మాట్లాడారు. ప్రచారం తీరు, గెలుపు అంశాలపై చర్చించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని