logo

బాలికలకు భరోసా

ప్రస్తుత సమాజంలో బాలికలు, యువతులు, అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వీటికి పాల్పడే వారిపై ఫిర్యాదుకు వెనుకాడుతుండటంతో బాధితులకు సరైన న్యాయం జరగడంలేదు. చట్టాలు ఎన్ని ఉన్నా.. ఆశించిన

Updated : 25 Jun 2022 04:55 IST

వేధింపులపై ఫిర్యాదుకు ప్రత్యేక యాప్‌

న్యూస్‌టుడే, వికారాబాద్‌

జాతీయ బాలల సంరక్షణ యాప్‌

ప్రస్తుత సమాజంలో బాలికలు, యువతులు, అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వీటికి పాల్పడే వారిపై ఫిర్యాదుకు వెనుకాడుతుండటంతో బాధితులకు సరైన న్యాయం జరగడంలేదు. చట్టాలు ఎన్ని ఉన్నా.. ఆశించిన మార్పు రావడం లేదు. చాలా మంది నేరం చేసిన వారికి భయపడి ఫిర్యాదులు చేయడం లేదు. మరి కొందరు తమ పరువు పోతుందని మిన్నకుంటున్నారు. ఇంకొందరు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసినా వేధింపులకు గురవుతున్నారు. దీంతో చాలా మంది బాధితులకు న్యాయం జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఇటు వంటి వారికి అడ్డుకట్ట వేసేందుకు నేరగాళ్లను శిక్షించడంతో పాటు, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దీనిని వినియోగించి చేసిన ఫిర్యాదుకు కఠిన చర్యలు తీసుకుంటారు.

ఇదీ విధానం...  

గూగుల్‌ ప్లేస్టోర్‌లో పీఓసీఎస్‌ఓ ఈబీఓఎక్స్‌ (ఫొక్సో ఈబాక్స్‌) అని టైప్‌ చేస్తే యాప్‌ కనిపిస్తుంది. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకొని తెరవాలి. లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్‌సీపీసీఆర్‌.జీవోవీ.ఇన్‌ అనే వెబ్‌సైట్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు. యాప్‌ తెరవగానే వృత్తంలో పోక్సో ఈబాక్స్‌ అని వృత్తాకారంలో కనిపిస్తుంది. ఫిర్యాదు చేయాలంటే దాన్ని క్లిక్‌ చేయాలి. సాధారణంగా చిన్నారులకు ఎదురయ్యే ఆరు రకాల హింసలకు సంబంధించిన చిత్రాలు కనిపిస్తాయి. చిన్నారులపై జరిగిన అఘాయిత్యం, జరిగేందుకు ఆస్కారమున్న ఆరు ప్రాంతాలు ఆట     స్థలం, దుకాణం, రహదారి మీద, పాఠశాల లేదా పాఠశాలకు వాహనాల్లో వెళ్లేటప్పుడు, బహిరంగ ప్రదేశాల్లో  బాలికలతో అనుచిత ప్రవర్తన, శరీర భాగాలను చిత్రీకరించడం వంటి వాటిని చిత్రాల రూపంలో పెట్టారు. హింస స్వభావాన్ని గమనించి ఆ చిత్రంపై క్లిక్‌ చేయాలి. అనంతరం ఫిర్యాదు పత్రంలో బాధితుల వివరాలు, జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలను పత్రంలో పొందుపర్చి సబ్మిట్‌ కొట్టాలి.

దిల్లీ కేంద్రంగా చర్యలు..

కేంద్ర ప్రభుత్వం బాలికలకు భరోసాను కల్పించేందుకు దేశ రాజధాని కేంద్రంగా చర్యలు ప్రారంభించింది. బాధితులు చేసిన ఫిర్యాదులను దిల్లీలో కేంద్ర ప్రత్యేక బృందం పర్యవేక్షణలో కొనసాగుతాయి. ఈ యాప్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు స్త్రీ, శిశు సంక్షేమాధికారి రాష్ట్ర కార్యాలయానికి, జిల్లా కేంద్రానికి సమాచారమిస్తారు. బాలల సంరక్షణ అధికార సిబ్బంది కూడా సహకరించి వెంటనే విచారణ చేపడతారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపే అధికారులకు ఫిర్యాదు ఎవరు చేశారన్న సమాచారం కూడా తెలియదు. దీంతో వంద శాతం పారదర్శకతతో విచారణ జరిపి పోలీసుల సహకారంతో కేసును నమోదు చేస్తారు. ఎప్పటికప్పుడు విచారణ కేసుకు సంబంధించిన పురోగతి వివరాలను పంపించాల్సి ఉంటుంది. ఫిర్యాదుదారులకు రక్షణ, నేరానికి పాల్పడిన వారికి శిక్ష పడేలా యంత్రాంగం తోడ్పాటునిస్తుంది. దీంతో బాధితులకు న్యాయం జరుగుతుంది.


ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి

- ప్రమీల, సీఐ, మహిళా పోలీస్‌ఠాణా, వికారాబాద్‌

కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన యాప్‌తో నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చు. యాప్‌పై ప్రతి ఒక్కరూ   అవగాహన పెంచుకోవాలి. దేశ పౌరులుగా జరుగుతున్న అన్యాయాలను వెంటనే చిత్రీకరించి యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేసి బాధితులకు న్యాయం చేసేలా చొరవ తీసుకోవాలి. ప్రభుత్వం యాప్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులను పోలీసుశాఖకు వివరాలను పంపుతుంది. వీటి ఆధారంగా కేసులను నమోదు చేసి నిందితుల ఆటకట్టిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని