logo

అమ్మో.. అడుగులోతు..

ప్రజల రాకపోకలు సాఫీగా సాగేందుకు నిర్మించిన చేగుంట- గజ్వేల్‌ రహదారి అధ్వానంగా మారింది.

Published : 03 Feb 2023 01:03 IST

ప్రధాన మార్గంలో ప్రజల అవస్థలు

నర్సంపల్లి వద్ద అస్తవ్యస్తం

న్యూస్‌టుడే, చేగుంట: ప్రజల రాకపోకలు సాఫీగా సాగేందుకు నిర్మించిన చేగుంట- గజ్వేల్‌ రహదారి అధ్వానంగా మారింది. నిత్యం వేలాది వాహనాలు తిరిగే మార్గంలో గుంతలు పడ్డాయి. ఒకే వరసగా ఉన్న ఈ రోడ్డును 2015లో రూ.35 కోట్లతో రెండు వరుసలుగా అభివృద్ధి చేశారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను ఈ దారి కలపడం వల్ల వేలాది మందికి ప్రయోజనం కలిగింది. ప్రస్తుతం అవస్థలకు నిలయంగా మారింది. ఈ రోడ్డులో ప్రయాణిస్తున్న వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి. అంతేకాకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి.


భారీ వాహనాలతో..

చేగుంట నుంచి కర్నాల్‌పల్లి, మక్కరాజుపేట, నర్సంపల్లి, ఇందుప్రియాల్‌, వడ్డేపల్లి తదితర గ్రామాల మీదుగా గజ్వేల్‌ వరకు రోడ్డు నిర్మించారు. 12 టన్నుల సామర్థ్యమున్న వాహనాలు వెళ్లే విధంగా తీర్చిదిద్దారు. అయితే నిర్మాణం పూర్తయ్యాక  గజ్వేల్‌కు దగ్గర కావటంతో భారీ వాహనాలు ఇటువైపునుంచే వెళ్తున్నాయి. ఒక్కో లారీ 40 టన్నుల బరువుతో రాకపోకలు సాగించడంతో, పెద్ద గుంతలు పడ్డాయి. అయినా ఇప్పటివరకు మరమ్మతు చేయలేదు. ఏడాది కిందట చేగుంట మండలం మక్కరాజుపేట వద్ద ఈ మార్గంలో ఎంత సామర్థ్యంతో వాహనాలు వెళ్తున్నాయో పరిశీలించారు.   గతంలో అరగంటలో గజ్వేల్‌కు వెళ్లేవారు. ఇప్పుడు 1.15 గంటలు పడుతోందంటూ  ప్రయాణికులు వాపోతున్నారు.  ప్రజాప్రతినిధులు ఈ మార్గంలో వెళ్తున్నారే తప్ప ప్రజల బాధలను గుర్తించడంలేదు.


చాలా ఇబ్బందిగా ఉంది

చేగుంట నుంచి గజ్వేల్‌కు వెళ్లేందుకు దగ్గర అవుతుందని వెళ్తున్నాం. కాని భారీ గుంతలు ఉండటంవల్ల ప్రయాణం కష్టంగా ఉంది. చాలా సార్లు ఇక్కడి నుంచే వెళ్లి వస్తుంటాం. పెద్దపెద్ద గుంతలతో వాహనాలు కూడా దెబ్బతింటున్నాయి. దీనిని బాగుచేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలి.

నాగరాజురెడ్డి, చిన్నశంకరంపేట


ద్విచక్ర వాహనంపై వెళ్లినా కష్టమే

ప్రతి రోజు ద్విచక్రవాహనంపై రాకపోకలు సాగిస్తుంటాను. ఏమాత్రం ఆదమరిచి వాహనంను నడిపినా గుంతలో పడిపోవటం ఖాయం. రోజు వేలాది వాహనాలు తిరిగే ఈ రోడ్డును బాగుచేసేందుకు ఎవ్వరు కూడా చర్యలు తీసుకోవటంలేదు. పెద్ద ప్రమాదాలు జరగకముందే బాగుచేయించాలి.

బోయిని వెంకటి, రెడ్డిపల్లి


త్వరలో మరమ్మతు చేయిస్తాం

త్వరలో రోడ్డు మరమ్మతు చేయిస్తాం. తాత్కాలికంగా గుంతలను పూడ్చివేస్తాం. భారీ వాహనాలు సామర్థ్యానికి మించి వెళ్లటంవల్ల సమస్య ఎక్కవైంది. కొత్త రోడ్డు వేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. నిధులు మంజూరైతే బాగుచేసి ఇబ్బందులు తొలగిస్తాం.

వెంకటేశ్‌, డీఈఈ, దుబ్బాక

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని