logo

బకెట్‌ వివాదం.. ప్రాణం తీసింది!

అనాథ విద్యార్థులు ఉండే వసతి గృహంలో జరిగిన చిన్నపాటి గొడవ శనివారం ఒకరి ఆత్మహత్యకు దారి తీసింది.

Published : 29 Jan 2023 04:04 IST

వీఎం హోం విద్యార్థి ఆత్మహత్య

సరూర్‌నగర్‌ క్రైం, న్యూస్‌టుడే: అనాథ విద్యార్థులు ఉండే వసతి గృహంలో జరిగిన చిన్నపాటి గొడవ శనివారం ఒకరి ఆత్మహత్యకు దారి తీసింది. సరూర్‌నగర్‌ పోలీస్‌ ఠాణా పరిధి కర్మన్‌ఘాట్‌లోని వీఎం హోం (విక్టోరియా మోమోరియల్‌)లో ఈ ఘటన జరిగింది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన బాలుడు (16) ఈ హోంలో పదోతరగతి చదువుతున్నాడు. పదేళ్ల కిందట తల్లిదండ్రులు మరణించడంతో ఆరేళ్ల క్రితం నగరానికి వచ్చి ఇక్కడ చేరాడు. శుక్రవారం రాత్రి ఈ బాలుడు, తోటి విద్యార్థులు ముగ్గురి మధ్య  నీటి బకెట్‌ కోసం గొడవ జరిగింది. వివాదం ముదరడంతో వారి నుంచి తప్పించుకునేందుకు బాలుడు గోడ దూకి బయటకు వెళ్లాడు. శనివారం ఉదయం కర్మన్‌ఘాట్‌ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో చెట్టుకు బాలుడు ఉరేసుకుని ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే విద్యార్థి అదృశ్యంపై హోం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సున్నిత మనస్కుడు కావడంతో బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలుడి బంధువులు హోం ముందు ధర్నా చేపట్టారు. సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. సిబ్బంది, తోటి విద్యార్థులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అధికారులు మృతుడి బంధువులతో చర్చించి రూ.5 లక్షల పరిహారం చెక్కును సోదరుడికి అందజేశారు. రెండు పడక గదుల ఇల్లు, పొరుగుసేవల ఉద్యోగం కోసం వారు డిమాండ్‌ చేయగా సానుకూలంగా స్పందించారు. దీంతో ఆందోళన విరమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని