logo

తపాలా ఓట్లకు ఫెసిలిటేషన్‌ కేంద్రాలు

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఇతర శాఖల ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Published : 04 May 2024 06:23 IST

నేటి నుంచి ఉద్యోగ సిబ్బంది వినియోగం
ఇంటి వద్దే ఓటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఇతర శాఖల ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పీవో, ఏపీవో, ఓపీవోలు, సూక్ష్మ పరిశీలకులకు ఇప్పటికే శిక్షణ తరగతులు నిర్వహించారు. పోలింగ్‌ విధులకు కేటాయించిన ఉద్యోగులు అందుకు సంబంధించిన ఉత్తర్వులతో పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసిన ఉద్యోగులకు ఓటు ఏ నియోజకవర్గంలో ఉన్నా(ఇతర జిల్లాల్లో కూడా) ఫెసిలిటేషన్‌ కేంద్రంలో ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. మే 4న పీవోలు, ఏపీవోలు; 5, 6న ఓపీవోలు; 7న పోలీసు సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఇవ్వనున్నారు. ఇతర జిల్లాల్లో ఓటు హక్కు ఉన్న అధికారులు, ఉద్యోగులకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు కలిపి ఒంగోలు భాగ్యనగర్‌లోని కేంద్రియ విద్యాలయంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. 6 నుంచి 8 వరకు ప్రతి ఒక్కరు బ్యాలెట్‌ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు షెడ్యూల్‌ ప్రకటించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తొలిసారిగా 85 సంవత్సరాల పైబడిన వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు ఇంటి వద్దనే ఓటింగ్‌ అవకాశం ఇవ్వనున్నారు. అర్హులైనవారు ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా, శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఇంటి వద్దనే ఓటింగ్‌ ప్రక్రియను ప్రారంభించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని