logo

తలమై సెయలగం సిరీస్‌ ట్రైలర్‌ విడుదల

రాష్ట్ర రాజకీయ నేపథ్యంతో వసంతబాలన్‌ దర్శకత్వం వహించిన థ్రిల్లర్‌ సీరిస్‌ ‘తలమై సెయలగం’. కిశోర్‌, శ్రేయారెడ్డి, ఆదిత్య మేనన్‌, భరత్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Updated : 10 May 2024 05:54 IST

సినిమా పోస్టరు
చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్ర రాజకీయ నేపథ్యంతో వసంతబాలన్‌ దర్శకత్వం వహించిన థ్రిల్లర్‌ సీరిస్‌ ‘తలమై సెయలగం’. కిశోర్‌, శ్రేయారెడ్డి, ఆదిత్య మేనన్‌, భరత్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రాడాన్‌ మీడియా వర్క్స్‌ నిర్మాత రాధిక శరత్‌కుమార్‌ నిర్మించారు. ఓ మహిళ అవిరామ అధికార కాంక్ష, అత్యాశ, వంచనవంటి అంశాలతో రాజకీయ నేపథ్యంతో తీర్చిదిద్దారు. 17న జీ5లో స్ట్రీమింగ్‌ కానున్న ఈ సిరీస్‌ ట్రైలర్‌ను నటి కీర్తి సురేశ్‌ తన ఎక్స్‌ పేజీలో బుధవారం సాయంత్రం విడుదల చేశారు.


రీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న సచ్చిన్‌

 

చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అగ్రనటుల సినిమాలు రీ రిలీజ్‌ చేస్తున్న నేపథ్యంలో విజయ్‌ నటించిన చిత్రాలు ఏకంగా వరుస కట్టాయి. ఇప్పటికే ‘గిల్లి’ రీరిలీజ్‌తో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ‘విల్లు’ కూడా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో 2005లో తమిళ నూతన సంవత్సరాది సందర్భంగా విడుదలైన ‘సచ్చిన్‌’ 19 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి రానుంది. ఇందులో విజయ్‌ సరసన జెనిలియా నటించారు. అప్పట్లో రజనీకాంత్‌ ‘చంద్రముఖి’, కమలహాసన్‌ ‘ముంబయి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రాలతో పాటు ‘సచ్చిన్‌’ విడుదలై కలెక్షన్ల పరంగా వసూళ్ల వర్షం కురిపించింది.


కల నెరవేర్చిన రసవాతి.. అర్జున్‌ దాస్‌

చెన్నై, న్యూస్‌టుడే: శాంతకుమార్‌ దర్శకత్వంలో అర్జున్‌ దాస్‌, తాన్యా రవిచంద్రన్‌ ప్రధానపాత్రలు పోషించిన చిత్రం ‘రసవాతి’. శుక్రవారం విడుదల కానుంది. సినిమా గురించి అర్జున్‌ దాస్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనకు అద్భుతమైన పాత్ర లభించిందని, తమిళంతోపాటు తెలుగు, కన్నడం, మలయాళం తదితర భాషల్లోనూ విడుదల కానుందని తెలిపారు. శాంతకుమార్‌ దర్శకత్వంలో నటించాలనే కల ‘రసవాతి’ ద్వారా నెరవేరిందని పేర్కొన్నారు.


సాయి పల్లవికి అమరన్‌ బృందం శుభాకాంక్షలు

చిత్రబృందం పోస్టు చేసిన పోస్టరు
చెన్నై, న్యూస్‌టుడే: నటి సాయిపల్లవి 32వ జన్మదిన వేడుకలు సందర్భంగా ఆమెకు చిత్రరంగ ప్రముఖులు, అభిమానులు గురువారం సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నటిస్తున్న ‘అమరన్‌’ చిత్రబృందం జన్మదిన శుభాకాంక్షలు తెలిపేలా ప్రత్యేక పోస్టరు ఎక్స్‌పేజీలో పోస్టు చేసింది. యథార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ‘అమరన్‌’లో శివకార్తికేయన్‌ మిలటరీ మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ పాత్రలో నటిస్తుండగా కమలహాసన్‌కు చెందిన రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ నిర్మిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని