logo

షర్మిలకు మద్దతుగా పులివెందులలో సునీత ప్రచారం

కడప పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వైఎస్‌ షర్మిల తరఫున మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత దంపతులు గురువారం నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు.

Published : 19 Apr 2024 03:13 IST

షర్మిలకు ఓటేయాలని విన్నవిస్తున్న సునీత

ఈనాడు-కడప, న్యూస్‌టుడే-పులివెందుల: కడప పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వైఎస్‌ షర్మిల తరఫున మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత దంపతులు గురువారం నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. పులివెందులలోని పూలంగళ్ల సర్కిల్‌లోని వినాయకస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం పీసీసీ మీడియా సెల్‌ కన్వీనర్‌ తులసిరెడ్డితో కలిసి ప్రచారం చేపట్టారు. కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిలకు ఓటేయాలని విన్నవించారు. సునీత తమ ఇంట్లోకి వచ్చేసరికి పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. వివేకాతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన తండ్రిని హత్య చేసి అయిదేళ్లయినా న్యాయం జరగలేదని, చంపినవాళ్లను ప్రజాకోర్టులోనైనా శిక్షించాలని సునీత ఓటర్లను కోరారు. పులివెందుల నియోజకవర్గ ప్రజలకు వివేకానందరెడ్డి 40 ఏళ్లు సేవలు అందించారని తెలిపారు. హత్య చేయడమే కాకుండా ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా రాతలు రాస్తున్నారంటూ వివరించారు. ఆయన్ని అవమానించేలా ఫొటోలు, వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. జరిగిన అన్యాయంపై తాము మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నామని, తప్పకుండా షర్మిలకు మద్దతు తెలుపుతామంటూ వారు సునీతకు భరోసా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని