logo

అన్నా క్షమించు... ఈ లోకంలో బతకలేకున్నా

ఆ తల్లి ఎన్ని కష్టాలు అనుభవించిందో కొడుకు, కూతురితో కలిసి చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించింది. ‘అన్నా క్షమించు జీవితంలో తొలిసారి నీకు చెప్పకుండా తప్పు చేస్తున్నా.. నాతో పాటు నా బిడ్డల్ని తీసుకెళ్తున్నా.. తల్లికన్నా ఎక్కువగా చూసుకున్నావు, ఇన్నేళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటూ నా జీవితాన్ని బాగు చేయాలని ఎంతో శ్రమించావు.

Updated : 30 Apr 2024 08:23 IST

కూతురు, కుమారుడితో సహా తల్లి ఆత్మహత్య

కుమారుడు, కుమార్తెతో ఉమామహేశ్వరి (పాతచిత్రం)

వల్లూరు, న్యూస్‌టుడే: ఆ తల్లి ఎన్ని కష్టాలు అనుభవించిందో కొడుకు, కూతురితో కలిసి చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించింది. ‘అన్నా క్షమించు జీవితంలో తొలిసారి నీకు చెప్పకుండా తప్పు చేస్తున్నా.. నాతో పాటు నా బిడ్డల్ని తీసుకెళ్తున్నా.. తల్లికన్నా ఎక్కువగా చూసుకున్నావు, ఇన్నేళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటూ నా జీవితాన్ని బాగు చేయాలని ఎంతో శ్రమించావు. ఇక చాలు, నీకు భారం కాదలుచుకోలేదు. మా ఆత్మహత్యలకు భర్త శ్రీహరి, అత్త సరస్వతి, ఆడపడుచు శశికళతో పాటు లక్ష్మీపతి కారణమంటూ’ అన్నకు చివరిసారిగా చరవాణి ద్వారా వాయిస్‌ మెసేజ్‌ పంపి బిడ్డలతో సహా తనువు చాలించిన విషాదకర సంఘటన వల్లూరులో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చెన్నూరు మండలం గొర్లపుల్లయ్య వీధికి చెందిన ఉమామహేశ్వరి (45)కి కడప నగరానికి చెందిన శ్రీహరితో 2005లో వివాహమైంది. వీరికి కుమారుడు ఫణికుమార్‌ (17) కుమార్తె ధనలక్ష్మి (16) ఉన్నారు. కాపురం సజావుగా సాగుతున్న క్రమంలో శ్రీహరి జీవనోపాధికి కువైట్‌ వెళ్లాడు. ఈ క్రమంలో కుటుంబంలో మనస్పర్థలు రావడంతో గొడవలు తీవ్రమై ఉమామహేశ్వరి తనకు వద్దంటూ భర్త వాదనకు దిగాడు. దీంతో ఉమామహేశ్వరి తన పిల్లలతో కలిసి 12 ఏళ్లుగా చెన్నూరులోని తన అన్న రాజేంద్రప్రసాద్‌ ఇంట్లోనే ఉంటున్నారు. ఫణికుమార్‌ మోటారు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ధనలక్ష్మి ఇంటర్‌ పూర్తి చేసింది. చెల్లెలి కాపురాన్ని నిలబెట్టేందుకు రాజేంద్రప్రసాద్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భర్త కువైట్‌ నుంచి వచ్చాక ఉమామహేశ్వరిని కాపురానికి తీసుకెళ్లకపోవడంతో గొడవలు తీవ్రమై కోర్టుకు వెళ్లారు. ఉమామహేశ్వరి తన భర్త నుంచి చట్ట ప్రకారం రావాల్సిన డబ్బు కోసం కోర్టును ఆశ్రయించారు. రూ.10 లక్షల నగదు ఇవ్వాలంటూ కోర్టు శ్రీహరిని ఆదేశించింది. అంత నగదు చెల్లించలేనంటూ నెలరోజుల పాటు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. ఉమామహేశ్వరి భరణం కోసం మరోమారు కోర్టు మెట్లెక్కింది. కొంత మొత్తం భరణం చెల్లించాలని కోర్టు శ్రీహరిని ఆదేశించింది. ఈ క్రమంలో ఉమామహేశ్వరి కోర్టుల చుట్టూ తిరిగి జీవితంపై విరక్తి చెంది తనువు చాలించాలని నిర్ణయించుకుంది. ఈ నెల 27న సాయంత్రం గుడికి వెళ్లి వస్తానంటూ పిల్లలతో సహా ఇంటి నుంచి వచ్చేసింది. అదే రోజు రాత్రి 10 గంటలకు రాజేంద్రప్రసాద్‌కు చరవాణి ద్వారా మెసేజ్‌ పంపించి కుమారుడు, కూతురుతో సహా చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం పశువులకాపరులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాలను పరీక్షల నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. వీరి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని