కొవిడ్‌ ఉద్ధృతి తగ్గాలంటే... వ్యాక్సిన్‌ ఉద్ధృతి పెరగాల్సిందే

దేశంలో మహమ్మారి మూడో ఉద్ధృతి కమ్ముకొస్తోందని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధం కావాలంటూ ప్రధాని మోదీ రాష్ట్రాలకు

Updated : 17 Jul 2021 05:58 IST

చల్లా విజయభాస్కర్‌
ఈనాడు-దిల్లీ

దేశంలో మహమ్మారి మూడో ఉద్ధృతి కమ్ముకొస్తోందని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధం కావాలంటూ ప్రధాని మోదీ రాష్ట్రాలకు లేఖలు రాస్తున్నారు. శుక్రవారం ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులో సమావేశమై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు సెప్టెంబరులో కొవిడ్‌ మూడోదశ తీవ్రస్థాయికి చేరవచ్చని వివిధ పరిశోధన సంస్థలు లెక్కలు వేశాయి. ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో కేసులు భారీగానే నమోదవుతున్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో పలు ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి ఊపందుకొంది. ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లినవారు, కొత్తగా వైరస్‌ బారిన పడుతున్నవారి మధ్య తేడా క్రమంగా తగ్గుతోంది. ఆర్‌ ఫ్యాక్టర్‌ 1కి సమీపిస్తోంది.

ఈ తరుణంలో కొవిడ్‌ మూడో ఉద్ధృతిని నిలువరించే ప్రధాన అస్త్రం- వ్యాక్సినేషన్‌!

వీలైనంత త్వరగా, వీలైనంత ఎక్కువమందికి పూర్తిస్థాయిలో టీకాలు అందిస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుంది. దేశంలో 94.47 కోట్ల మంది వయోజనులున్నారు. డిసెంబరు 31 నాటికల్లా అర్హులందరికీ వ్యాక్సిన్‌ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మొత్తం 189 కోట్ల డోసులు కావాలి. కానీ, శుక్రవారం కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ చేసిన ప్రకటన మేరకు ఇప్పటివరకూ అందినవి 39.53 కోట్లే! అందులోనూ కేవలం 8.38% మందికే రెండు డోసులు వేశారు. దేశంలో    33.46% మందికి ఒక్కడోసే అందింది. డిసెంబరు 31లోపు లక్ష్యం చేరడానికి రోజూ సుమారు 88 లక్షల డోసులు అందించాల్సి ఉన్నా, జులైలో రోజూ 37.75 లక్షల డోసులే అందిస్తున్నారు. జనవరి 16న టీకా కార్యక్రమం మొదలైనప్పటి నుంచి 182 రోజులుగా సగటున 21.72 లక్షల డోసులు మాత్రమే ఇస్తున్నారు.

వ్యాక్సినేషన్‌ను ఉద్ధృతం చేయకుంటే... మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడం ప్రశ్నార్థకమే!

దేశంలో ఉత్పత్తి అవుతున్న టీకాల్లో 75% డోసులను కేంద్రం రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తోంది. మిగతా 25% మొత్తాన్ని ప్రైవేటు సంస్థలు కొనుగోలుచేసి ప్రజలకు అందిస్తాయని ప్రకటించింది. ఆ మేరకు జులైలో రాష్ట్రాలకు 12 కోట్ల డోసులు ఇస్తామని కేంద్రం
తెలిపింది. ఇందులో 9 కోట్లు ప్రభుత్వ వ్యాక్సిన్‌ కేంద్రాలకు, 3 కోట్లు ప్రైవేటు సెంటర్లకు కేటాయించింది. ఒక్క నెలలో 12 కోట్ల టీకాలు అందించాలంటే... రోజూ 38.70 లక్షల డోసులివ్వాలి. కానీ, ఈనెలలో ఇప్పటివరకూ సగటున నిత్యం 37,75,325 టీకాల చొప్పున మొత్తం 5,66,29,887 డోసులిచ్చింది. శుక్రవారం నాటి కొవిన్‌ పోర్టల్‌ ప్రకారం 35,010 ప్రభుత్వ, 2,023 ప్రైవేటు కేంద్రాలు టీకాలను అందిస్తున్నాయి. మొత్తం కేంద్రాల్లో ప్రైవేటు వాటా 5.46 శాతమే. కానీ, వాటికి ఏకంగా 25% టీకాలను వదిలిపెట్టడంతో లక్ష్యం దెబ్బతింటోందన్న వాదనలున్నాయి. శుక్రవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 39,53,43,767 మందికి టీకా ఇచ్చారు. ఇందులో 31.61 కోట్ల మంది ఒక డోసు, 7.92 కోట్ల మంది రెండు డోసులు తీసుకున్నారు.

సుప్రీంకోర్టుకు కేంద్రం ఏం చెప్పింది?

ఈనెల చివరినాటికి 51.6 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి వస్తాయని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది. ఇప్పటివరకూ 41.10 కోట్ల డోసులను రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. ఇంకా 10.5 కోట్ల టీకాలు ఇవ్వాల్సి ఉంది. మిగిలిన రోజుల్లో సగటున నిత్యం 66 లక్షల టీకాలు అందించాలి. ఈనెల 1 నుంచి జరుగుతున్న వాక్సినేషన్‌ తీరును చూస్తే... రోజూ సగటున  37.75 లక్షల డోసులే ప్రజలకు అందుతున్నాయి.

పూర్తిస్థాయి వ్యాక్సినేషన్‌కు 189 కోట్ల టీకాలు అవసరం. ఇప్పటివరకూ రాష్ట్రాలకు సరఫరా చేసిన 41.10 కోట్లను మినహాయిస్తే, ఇంకా 148 కోట్ల డోసులు కావాలి.

డిసెంబరు నాటికి అర్హులందరికీ ‘పూర్తిస్థాయి’లో టీకా అందిస్తామని కేంద్రం ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి ఇందుకు మిగిలివున్నది ఐదున్నర నెలలే. సుమారు 170 రోజుల  వ్యవధిలో నిత్యం సగటున 87,05,882 డోసులివ్వాలి. కానీ, ప్రస్తుతం ఆ స్థాయిలో టీకాలు అందుబాటులో లేవు!

ప్రారంభంకాని ఉత్పత్తి

సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో- ఆగస్టు-డిసెంబరు మధ్య దేశంలో ఐదు సంస్థల ఉత్పత్తి ద్వారా 135 కోట్ల టీకా డోసులు   సమకూరుతాయని కేంద్రం తెలిపింది. 5 రకాల వ్యాక్సిన్లలో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, బయో-ఈ, జైడస్‌ క్యాడిలా, స్పుత్నిక్‌-వి ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ తప్పితే... మిగతావాటి ఉత్పత్తి దేశీయంగా ప్రారంభం కాలేదు. స్పుత్నిక్‌-వి... సెప్టెంబరు నుంచి పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఏటా 30 కోట్ల డోసులు ఉత్పత్తి చేయాలన్నది ఆ సంస్థ లక్ష్యం. అంటే నెలకు రెండున్నర కోట్ల డోసులన్నమాట. ఆ ప్రకారం- డిసెంబరు చివరినాటికి 10 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయి. ఆగస్టు-డిసెంబరు మధ్య కొవిషీల్డ్‌ టీకాలు 50 కోట్లు, కొవాగ్జిన్‌ 40, బయో-ఈ 30, జైడస్‌ క్యాడిలా నుంచి 5 కోట్ల డోసులు వస్తాయని కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది. కానీ, ఇదే సమయంలో 44 కోట్ల కొవిషీల్డ్‌,  25 కోట్ల కొవాగ్జిన్‌ డోసుల కొనుగోలుకే   ఆర్డర్‌ ఇచ్చింది.

40 కోట్ల డోసుల కొరత?

డిసెంబరు నాటికి మొత్తం 108.6 కోట్ల డోసుల కొనుగోలుకు రూ.9,381.82 కోట్లు చెల్లించినట్లు కేంద్రం పేర్కొంది. ఓవైపు 148 కోట్ల డోసుల అవసరం ఉండగా, ఇప్పటివరకూ 108.6 కోట్ల డోసులకే డబ్బు చెల్లించినట్లు అఫిడవిట్‌ను బట్టి తెలుస్తోంది. మిగతా 40 కోట్ల టీకాలను ప్రైవేటుకు సరఫరా చేస్తారా? లేదంటే ఆ మేర లోటు ఉంటుందా? అన్నది తెలియడంలేదు.

ప్రైవేటు కోటాను 10 శాతానికి పరిమితం చేయాలని ఇటీవల కొందరు ముఖ్యమంత్రులు ప్రధానికి లేఖ రాశారు. దీనిపై కేంద్రం నుంచి ఇప్పటివరకూ స్పందన లేదు.

10, 13 స్థానాల్లో ఏపీ, తెలంగాణ...

వయోజనుల నిష్పత్తి, రోజువారీ వ్యాక్సిన్ల సంఖ్య, వృథా ఆధారంగా రాష్ట్రాలకు కేంద్రం టీకాలు కేటాయిస్తోంది. వ్యాక్సినేషన్‌లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ 10వ స్థానంలో, తెలంగాణ 13వ స్థానంలో ఉన్నాయి. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్రం బహిర్గతం చేయడంలేదు. వ్యాక్సినేషన్‌ నెమ్మదించడానికి రాష్ట్రాలే కారణమని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఆరోపణలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం జూన్‌లో 11.46 కోట్లు అందించింది, జులైలో 13.50 కోట్ల డోసులు అందిస్తోందని ప్రకటించారు. ఎప్పుడు ఎన్ని వ్యాక్సిన్లు అందించేదీ 15 రోజుల ముందుగానే చెబుతున్నామని, దానికి తగ్గట్టు ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని పేర్కొన్నారు. అయినా, వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద భారీగా జనం గుమిగూడుతున్నారంటే... అందుకు బాధ్యత రాష్ట్రాలదేనన్నారు. మంత్రి చెప్పినట్టు  ఈనెలలో 13.50 కోట్ల డోసులు సరఫరా చేసేట్టయితే... రోజూ సగటున 43.54 లక్షల డోసులు అందించాలి. కానీ ఇప్పటివరకు 37.75 లక్షల చొప్పునే అందిస్తున్నారు. మిగిలిన 14 రోజుల్లో నిత్యం 55.97 లక్షల చొప్పున 7,83,70,113 డోసులను అందుబాటులోకి తేవాలి.


ఇదీ టీకా లెక్క

18 ఏళ్లు దాటినవారి సంఖ్య 94,47,09,596
అవసరమైన డోసులు 188,94,19,192
ఇప్పటివరకూ అందించినవి 39,53,43,767
ఇంకా కావాల్సిన డోసులు సుమారు 148 కోట్లు
ఒక్కడోసు తీసుకున్నవారు 31,61,16,189
రెండు డోసులు అందుకున్నవారు 7,92,27,578
డిసెంబరు 31 వరకూ రోజూ కావాల్సినవి 87,05,882
ఇప్పటివరకూ నిత్యం సగటున అందించినవి 21,72,218

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని