Azadi Ka Amrit Mahotsav: తిండికి లేకున్నా... తిరుగుబాటు ఆపలేదు

క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో మహారాష్ట్రలోని సతారా ప్రాంతంలో ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించింది తుపాన్‌ సేన. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది హౌసాతాయి. తండ్రి నానాపాటిల్‌ కొలువు వదిలేసి...

Updated : 15 May 2022 06:04 IST

ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఆంగ్లేయులు లాగేసుకున్నారు. ఊరివాళ్లు భయంతో దూరమయ్యారు. చేసేందుకు పని కూడా ఇవ్వని పరిస్థితి... అయినా ఆమె కుటుంబం తెల్లవారిపై తిరుగుబాటు ఆపలేదు. దేశం పట్ల బాధ్యత మరవలేదు. తుపాన్‌ సేనలో చేరి బ్రిటిష్‌ సర్కారును ముప్పుతిప్పలు పెట్టిన ధీశాలి హౌసాతాయి!

క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో మహారాష్ట్రలోని సతారా ప్రాంతంలో ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించింది తుపాన్‌ సేన. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది హౌసాతాయి. తండ్రి నానాపాటిల్‌ కొలువు వదిలేసి... స్వాతంత్య్ర సమరంలో దూకారు. ఆయనపై అరెస్టు వారెంట్‌ జారీ చేసింది బ్రిటిష్‌ సర్కారు. వారి ఇంటిని, ఆస్తిని... ప్రభుత్వం జప్తు చేసింది. నానాపాటిల్‌ అజ్ఞాతంలో ఉంటే కుటుంబమంతా రోడ్డున పడింది. ఆస్తులను వేలం వేస్తే నానాపాటిల్‌పై గౌరవంతో కొనడానికి గ్రామంలోని ఎవ్వరూ ముందుకు రాలేదు. అలాగని వారి కుటుంబాన్ని ఆదుకున్నారనీ కాదు. ప్రభుత్వానికి భయపడి కుటుంబంతో మాట్లాడటం మానేశారు. గ్రామంలో సరకులు కూడా పుట్టని పరిస్థితి. కూలీ పని చేస్తామన్నా ఇవ్వలేదు. సమీప గ్రామంలోని బంధువొకరు సాయం చేయటంతో బతుకు గడిచేది.

అజ్ఞాతంలో ఉంటూనే... రాంచంద్ర శ్రీపతి లాడ్‌, కెప్టెన్‌ భావ్‌, మరి కొంతమందితో కలసి ఓ దళాన్ని ఏర్పాటు చేశారు నానాపాటిల్‌. అదే తుపాన్‌ సేన. పాటిల్‌ కుమార్తె హౌసాతాయి కూడా అందులో చేరింది. ఆంగ్లేయులు గుర్తు పట్టకుండా... రహస్యాలు, సందేశాలు, ఆయుధాలు చేరవేసేది. ఓ రోజు పోలీసు స్టేషన్‌ ముందు హౌసాతాయిని భర్త చితకబాదాడు. ఇది చూసిన పోలీసులు లోపలి నుంచి పరుగెత్తుకొని వచ్చి... వారికి సర్దిచెప్పి ఇంటికి పంపించారు. నిజానికి...దెబ్బలు తిన్నది హౌసాతాయినేగాని... కొట్టింది నిజమైన భర్త కాదు. పోలీసుల కళ్లుగప్పి ఆయుధాలు కొట్టేసేందుకు తుపాన్‌ సేన పథకంలో భాగంగా ఆడిన నాటకం అది. అప్పటికి హౌసాతాయి వయసు 17 సంవత్సరాలే. ఇది మొదలుగా... పోలీసు స్టేషన్ల నుంచి ఆయుధాలు కొట్టేయటం; బ్రిటిష్‌ ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టడం ద్వారా ఆంగ్లేయుల్లో భయాందోళనలు సృష్టించారు. 1943 జూన్‌లో... షెనోలి అనే ప్రాంతంలో... బ్రిటిష్‌ సర్కారు సొమ్ము తరలిస్తున్న రైలును కొల్లగొట్టారు. ఇందులో హౌసాతాయి, కెప్టెన్‌ భావ్‌ కీలక పాత్ర పోషించారు. ఎలాంటి ఆయుధాలూ లేకుండానే... బండలు అడ్డం పెట్టి... గార్డును బోల్తా కొట్టించి... సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తాన్ని పేదలకు పంచి పెట్టారు. అలా తెలివిగా పోలీస్‌ స్టేషన్లపై దాడులు చేస్తూ ఆయుధాలు సమకూర్చుకున్న ఈ తుపాన్‌ సేన కొంతకాలం పాటు సుమారు 600 గ్రామాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపింది. సజావుగా పాలన కొనసాగించింది. ప్రజల మద్దతు కూడా లభించటంతో తుపాన్‌ సేనను చూసి బ్రిటిష్‌ పోలీసులు సైతం భయపడే పరిస్థితి నెలకొంది. ఆయుధాల సరఫరా క్రమంలో... తుపాన్‌ సేన సభ్యుడు జోషిని గోవా (పోర్చుగీసు వారి స్వాధీనంలో ఉందప్పటికి) పోలీసులు పట్టుకున్నారు. దీంతో ఆయన్ను విడిపించటానికి హౌసాతాయి బృందం బయల్దేరింది. తప్పించుకునే మార్గాన్ని చిన్న కాగితంపై రాసి తలసిగలో తురుముకొని జైలుకెళ్లి సోదరిగా జోషిని కలిసి ఇచ్చివచ్చింది. తిరిగి వచ్చేప్పుడు పోలీసులకు పట్టుబడకుండా ఉండటానికి మండోవి నది దాటాల్సి వచ్చింది. ఎలాంటి పడవ అందుబాటులో లేకపోవటంతో ఈదాల్సిందే. అర్ధరాత్రి... బృందంలోని ఇతర సభ్యులు నీటిలో ఈదుతుంటే... హౌసాతాయికి ఇబ్బంది ఎదురైంది. ఓ చెక్కపెట్టెను గట్టిగా పట్టుకొని  దానిపై పడుకొని... అతికష్టం మీద నదిని దాటారు. 15 రోజుల తర్వాత ఇల్లు చేరారు. కొద్దిరోజుల తర్వాత జోషి జైలు నుంచి తప్పించుకొని వచ్చారు. తుపాన్‌ సేనలోని అనేక మంది స్వాతంత్య్రానంతరం కూడా రైతుల కోసం ఉద్యమించారు. 2018లో జరిగిన రైతుల మహా పాదయాత్రకు 92 ఏళ్ల హౌసాతాయి మద్దతిచ్చారు. నేను సైతం రైతు యాత్రకు సిద్ధమన్న ఆ మహాధీర.. నిరుడు 95వ ఏట కన్నుమూశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని