icon icon icon
icon icon icon

Arvind Kejriwal: ఖలిస్థానీ అనుకూల గ్రూపుల నుంచి నిధుల స్వీకరణ.. కేజ్రీవాల్‌పై ఎన్‌ఐఏ దర్యాప్తు..!

ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ చిక్కులు మరింత పెరగనున్నాయి. ఈసారి ఎన్‌ఐఏ ఆయనపై దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది.

Published : 06 May 2024 20:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై మరో దర్యాప్తు మొదలయ్యే అవకాశం ఉంది. ఖలిస్థానీ అనుకూల గ్రూపు ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నుంచి ఆప్‌ నిధులను స్వీకరించినట్లు వచ్చిన ఆరోపణలపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా స్పందించారు. ఈ అంశంపై ఎన్‌ఐఏతో విచారణ జరిపించాలని ఆయన సిఫార్స్‌ చేశారు. ఈ ఆరోపణలను ఆప్‌ తోసిపుచ్చింది. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా మరో కుట్రకు తెర లేపారని అభివర్ణించింది. 

లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయం ప్రకారం వీకే సక్సేనాకు ఆప్‌పై ఫిర్యాదు అందింది. ‘ది వరల్డ్‌ హిందూ ఫెడరేషన్‌’కు చెందిన ఆషూ మోంగియా దీనిని పంపారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఎల్జీ పంపిన సిఫార్సుల ప్రకారం.. 1993 దిల్లీ పేలుళ్ల నిందితుడు దేవేందర్‌ పాల్‌ భుల్లర్‌ను విడిపించేందుకు సాయం చేయడం కోసం, ఖలిస్థానీ అనుకూల భావాలను సమర్థించేందుకు 16 మిలియన్‌ డాలర్లను ఎస్‌ఎఫ్‌జే నుంచి ఆప్‌ అందుకొన్నట్లు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. దీనికి ఫిర్యాదుదారులు ఎలక్ట్రానిక్‌ ఆధారాలను కూడా జోడించారన్నారు. వీటిపై ఫోరెన్సిక్‌ పరీక్షలు సహా దర్యాప్తు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు.

ఇక 2014 జనవరిలో కేజ్రీవాల్‌ నుంచి ఇక్బాల్‌ సింగ్‌కు వెళ్లిన లేఖను కూడా దీనిలో ప్రస్తావించారు. ‘‘ఇప్పటికే ఆప్‌ ప్రభుత్వం ప్రొఫెసర్‌ భుల్లర్‌ను విడుదల చేయాలని రాష్ట్రపతికి సిఫార్సు చేసింది’’ అన్న విషయాన్ని వెల్లడించారు. గవర్నర్‌ తన ఫిర్యాదుకు ఎస్‌ఎఫ్‌జే ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూపై ఇటీవల కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణల వీడియోను జోడించారు. 

లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఎన్‌ఐఏ దర్యాప్తునకు సిఫార్స్‌ చేయడంపై ఆప్‌ స్పందించింది. ‘‘ఎల్జీ సర్‌ భాజపా ఏజెంట్‌. దిల్లీలో ఏడు సీట్లను ఆ పార్టీ ఓడిపోబోతోంది. అందుకే కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా తెరతీసిన మరో కుట్ర ఇది. పంజాబ్‌ ఎన్నికలకు ముందే ఆ పార్టీ దీనిని సిద్ధం చేసింది’’ అని దిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్ పేర్కొన్నారు.

అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌కి 2014-22 మధ్య ఖలిస్థానీ గ్రూపుల నుంచి 1.6 కోట్ల డాలర్ల మేర (సుమారు రూ.133.48 కోట్లు) డబ్బులు అందాయని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ ఈ ఏడాది మార్చిలో ఆరోపించిన విషయం తెలిసిందే. డబ్బు ముట్టజెప్పినట్లయితే ఉగ్రవాది దేవీందర్‌ పల్‌సింగ్‌ భుల్లర్‌ను జైలు నుంచి విడుదల చేయిస్తానని 2014లో కేజ్రీవాల్‌ (దిల్లీ ముఖ్యమంత్రి) ప్రతిపాదించినట్లు ఈసందర్భంగా పేర్కొన్నాడు. ఖలిస్థాన్‌ అనుకూల సిక్కులతో న్యూయార్క్‌లోని రిచ్‌మండ్‌ హిల్‌లో ఒక గురుద్వారాలో జరిగిన సమావేశంలో ఈ హామీ లభించినట్లు తెలిపాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img