బలహీన పడిన ‘నివర్’‌

అతి తీవ్ర తుపాన్‌ నివర్‌ తీవ్రత క్రమంగా తగ్గుతోంది. తీరం దాటిన తర్వాత తీవ్ర తుపానుగా మారింది. పుదుచ్చేరి సమీపంలో బుధవారం అర్ధరాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2.30 గంటల మధ్యలో ‘నివర్’ తీరం దాటినట్లు వాతావరణ శాఖ..

Updated : 13 Sep 2023 15:21 IST

అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపాను స్థాయికి

చెన్నైలో చెట్టు కూలి వ్యక్తి మృతి

చెన్నై: అతి తీవ్ర తుపాన్‌ నివర్‌ తీవ్రత క్రమంగా తగ్గుతోంది. తీరం దాటిన తర్వాత తీవ్ర తుపానుగా మారింది. పుదుచ్చేరి సమీపంలో బుధవారం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2.30 గంటల మధ్యలో ‘నివర్’ తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో 120 నుంచి 145 కి.మీ వేగంతో పెనుగాలులు వీయగా.. తర్వాత కూడా కొద్ది గంటలపాటు ప్రభావం కొనసాగింది. తుపాను ధాటికి తమిళనాడులోని చెన్నై సహా  కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. ఏపీలో నెల్లూరుపై ప్రభావం ఎక్కువగా ఉండగా.. చిత్తూరులోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

బుధవారం నుంచే పుదుచ్చేరి, తమిళనాడు తీరప్రాంతాల్లో పెనుగాలులు, అతిభారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గాలులకు భారీ చెట్లుకూడా నేలకొరిగాయి.అనేక చోట్ల విద్యుత్‌ స్తంభాలు కూడా పడిపోయాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తమిళనాడులో ముందు జాగ్రత్తగా నాగపట్నం, విల్లుపురం, కడలూరు జిల్లాలతో పాటు మరిన్ని ప్రాంతాల నుంచి 1.45 లక్షల మందిని 1500పైగా పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి తరలించారు. చెన్నై, చెంగల్‌పట్టు, కడలూరుతోపాటు పుదుచ్చేరిలో నిన్న భారీ వర్షాలు కురిశాయి. చెన్నైలో బుధవారం 16సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పుదుచ్చేరిలో 10 సెంటీమీటర్లు కురిసింది. ఇవాళ తమిళనాడులోని 16 జిల్లాల్లో ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

చెట్టుకూలి వ్యక్తి మృతి
నివర్‌ ప్రభావంతో చెట్టు విరిగిపడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా..గాలివానకు ఒక్కసారిగా చెట్టు కూలింది. దీంతో ఆ వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ముమ్మరంగా సహాయక చర్యలు
తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 1200 వందల బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఒడిశాలో మరో 20 బృందాలను సిద్ధంగా ఉంచారు. నౌకాదళం కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోంది. చెన్నై తీరంలో కోస్టుగార్డులతోపాటు షిప్‌లను, హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. పుదుచ్చేరి  సర్కారు విజ్ఞప్తితో సైన్యం కూడా రంగంలోకి దిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు