రామమందిరానికి 300 కిలోల తాళం!

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన వృద్ధ దంపతులు ఏకంగా 300 కిలోల బరువున్న తాళాన్ని తయారు చేశారు. రామమందిరం రక్షణ కోసం దీన్ని రూపొందించినట్లు తెలిపారు....

Updated : 18 Mar 2021 04:59 IST

రూపొందించిన వృద్ధ దంపతులు

అలీగఢ్‌: అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణానికి దేశవ్యాప్తంగా భక్తులు తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. కొందరు విరాళాలు సమర్పిస్తుంటే మరికొందరు తమ నైపుణ్యమే పెట్టుబడిగా కానుకలు సమర్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన వృద్ధ దంపతులు ఏకంగా 300 కిలోల బరువున్న తాళాన్ని తయారు చేశారు. రామమందిరం రక్షణ కోసం దీన్ని రూపొందించినట్లు తెలిపారు. అలీగఢ్‌కు చెందిన ప్రకాశ్‌ శర్మ, రుక్మిణి శర్మ దంపతులకు తాళాలు చేయడంలో విశేష అనుభవం ఉంది. 40 ఏళ్లుగా వారు ఆ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. తాళాలతోపాటు ఇతర వస్తువులు.. ఇనుము, వెండి, రాగి, ఇత్తడితో మన్నికైన వస్తువులు తయారు చేయడంలో వీరు దిట్ట. లాక్‌డౌన్‌ కాలంలో పనిలేక సతమతమవుతున్న తమకు ఆ శ్రీరాముడు గొప్ప పని కల్పించాడని ప్రకాశ్‌ శర్మ పేర్కొన్నారు.

300 కిలోలున్న ఈ భారీ తాళం తయారీకి ఇనుము, రాగి, ఇత్తడి మిశ్రమాన్ని వినియోగించినట్లు ప్రకాశ్‌ శర్మ పేర్కొన్నారు. దీన్ని రూపుదిద్దేందుకు దాదాపు ఏడాది సమయం పట్టిందన్నారు. రోజుకు 8 గంటలు శ్రమించి ఈ భారీ తాళం తయారుచేశామని తెలిపారు. తాళం చెవి బరువు దాదాపు 20 కిలోలు ఉంటుందన్నారు. ఈ మొత్తం తయారీ కోసం రూ.లక్ష వరకు వెచ్చించినట్లు వెల్లడించారు. రామాలయం కోసం తాళం తయారుచేయడం సంతోషంగా ఉందని ఆ వృద్ధ దంపతులు పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని