హిందూస్థాన్‌ షిప్‌యార్డు ఘటనపై జగన్‌ ఆరా

విశాఖ షిప్‌యార్డులో జరిగిన ఘోర ప్రమాదం ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదానికి సంబంధించిన..

Updated : 01 Aug 2020 15:46 IST

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు, లోకేశ్

విశాఖపట్నం: విశాఖలోని హిందూస్థాన్‌ షిప్‌యార్డులో జరిగిన ఘోర ప్రమాదం ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. ఘటనపై తక్షణం చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ను సీఎం జగన్‌ ఆదేశించారు. షిప్‌ యార్డులో భారీ క్రేన్‌ సామర్థ్యం పరీక్షిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారు. హుద్‌హుద్‌ తుపాను సమయంలో పూర్తిగా ధ్వంసమైన పాత భారీ క్రేన్‌ స్థానంలో ఇటీవలే రూ.12 కోట్లతో కొత్త క్రేన్‌ను షిప్‌ యార్డు యాజమాన్యం కొనుగోలు చేసింది. నిర్వహణ బాధ్యతలను పొరుగు సేవలకు అప్పగించింది. మృతుల్లో ప్రసాద్‌, జగన్‌ శాశ్వత ఉద్యోగులు కాగా.. మిగిలిన వారు పొరుగుసేవల కార్మికులు. ప్రమాద సమయంలో క్రేన్‌ కేబిన్‌లో 15 మంది ఉన్నట్లు అక్కడి సిబ్బంది పేర్కొన్నారు. ఘటనాస్థలం వద్ద కార్మికుల బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుల వివరాలు తెలియక హెస్‌ఎస్‌ఎల్‌ ప్రధాన ద్వారం వద్ద బంధువులు ఆవేదన పడుతున్నారు.

వారంతా క్షేమంగా ఉండాలి: చంద్రబాబు
విశాఖ హిందూస్థాన్‌ షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదం బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రమాద సమయంలో 30 మంది వరకు ఉన్నారంటున్నారని పేర్కొన్నారు. వారంతా క్షేమంగా ఉండాలని భగవంతుణ్ని  ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. 

షిప్‌ యార్డు ప్రమాదంపై లోకేశ్ దిగ్భ్రాంతి
విశాఖ హిందూస్థాన్‌ షిప్‌ యార్డు ప్రమాదంపై తెదేపా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. 

భాజపా నేతల దిగ్భ్రాంతి

విశాఖ షిప్‌యార్డులో భారీ క్రేన్‌ కూలిన ఘటనపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు. మరోవైపు, ఈ ఘటనపై భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు విచారం వ్యక్తంచేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని