AP News: బ్యాంకుల్లో నిధులు దాచొద్దు.. ప్రభుత్వ శాఖలకు ఉత్తర్వుల జారీ

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంబంధిత సంస్థలు తమ వద్ద ఉన్న ప్రజాధనాన్ని ఏ ఇతర బ్యాంకుల్లోనూ డిపాజిట్ చేయడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది.

Published : 29 Nov 2021 17:17 IST

అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంబంధిత సంస్థలు తమ వద్ద ఉన్న ప్రజాధనాన్ని ఏ ఇతర బ్యాంకుల్లోనూ డిపాజిట్ చేయడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. కంపెనీ చట్టం కింద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్‌లోనే ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. ప్రజాధనం రక్షణకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ కార్పొరేషన్లు, సొసైటీలు, బోర్డులు, ట్రస్టులు, సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రత్యేక ప్రయోజనార్థం ఏర్పాటు చేసిన సంస్థలు సహా ఇతర సంస్థలన్నీ తమ వద్ద ఉన్న మిగులు నిధులు, ఇతరత్రా వసూలు చేసిన ఏ విధమైన సొమ్మునైనా.. ఇకపై ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్‌లోనే డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. తితిదే, ఇతర దేవాలయ సంస్థలకు మాత్రం తాజా ఉత్తర్వుల నుంచి మినహాయింపు లభించింది. రిజర్వు బ్యాంకు వద్ద బ్యాంకింగేతర ఫైనాన్షియల్‌ కంపెనీగా ఫైనాన్షియల్‌ సర్వీసు కార్పొరేషన్‌ను ప్రభుత్వం నమోదు చేసింది. ప్రభుత్వ సంస్థలు తమ నిధులను ఈ కార్పొరేషన్‌లో కూడా డిపాజిట్‌ చేయవచ్చని 2020 మార్చిలో ఉత్తర్వులిచ్చింది. దీంతోపాటు ఇతర వాణిజ్య షెడ్యూలు బ్యాంకుల్లోనూ సొమ్మును జమ చేసేందుకు వెసులుబాటు కల్పించింది. తాజాగా ఆ వెసులుబాటును తొలగించి.. కేవలం ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్‌లోనే నిధులు జమ చేయాలని ఆదేశాలిచ్చింది. అప్పుడే ఆ నిధులకు రక్షణ ఉంటుందని పేర్కొంది. 

ఇటీవల కాలంలో ప్రభుత్వ కార్పొరేషన్ల నిధులను అక్రమంగా మళ్లించిన అంశాలను జీవోలో ఉదహరించింది. ఏపీ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌కు సంబంధించిన రూ.9.60 కోట్ల నిధుల్లో కొంత మొత్తాన్ని ప్రైవేటు ఖాతాకు మళ్లించినట్టు పేర్కొంది. ఏపీ ఆయిల్‌ సీడ్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన రూ.5 కోట్ల నిధులను.. ఆ సంస్థకు తెలియకుండానే మళ్లించినట్టు తెలిపింది. ఇలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా ఉండేందుకే తాజా ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన ఆదేశాల్లో వివరించారు. అయితే తమ నిధులను ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్‌కు మళ్లించాలని ఇటీవల కొన్ని సంస్థలపై ఒత్తిడి వచ్చినా.. వారు పట్టించుకోలేదు. తమ పాలకవర్గ సమావేశాల్లో వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే తాజా ఉత్తర్వులు వెలువడ్డాయనే చర్చ సాగుతోంది.

Read latest General News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని