Smita Sabharwal: స్మితా సభర్వాల్‌ ఇంట్లోకి చొరబాటు.. డిప్యూటీ తహసీల్దార్‌ సస్పెన్షన్‌

తెలంగాణ సీఎం కార్యాలయ అధికారిణి, సీనియర్‌ ఐఏఎస్‌ స్మితా సభర్వాల్‌ (Smita Sabharwal) ఇంట్లోకి చొరబడిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

Updated : 23 Jan 2023 14:28 IST

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కార్యాలయ అధికారిణి, సీనియర్‌ ఐఏఎస్‌ స్మితా సభర్వాల్‌ (Smita Sabharwal) ఇంట్లోకి చొరబడిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించిన డిప్యూటీ తహసీల్దార్‌ ఆనంద్‌కుమార్‌రెడ్డిని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. కలెక్టర్‌ ఆదేశాలను చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితుడికి రెవెన్యూశాఖ అధికారులు అందించనున్నారు. మరోవైపు చొరబడిన వ్యవహారంపై పోలీసు నిఘావర్గాలు పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

ఏం జరిగిందంటే..

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ సమీపంలోని ప్లజెంట్‌ వ్యాలీ బి-11లో స్మితా సభర్వాల్‌ నివసిస్తున్నారు. ఇక్కడే నగర పోలీసు కమిషనర్‌ సహా పలువురు ఉన్నతాధికారులు నివసిస్తుండడంతో నిరంతరం పూర్తిస్థాయి భద్రత ఉంటుంది. మేడ్చల్‌ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న చెరుకు ఆనంద్‌కుమార్‌రెడ్డి (48), అతడి స్నేహితుడైన హోటల్‌ నిర్వాహకుడు కొత్త బాబుతో కలిసి కారులో ఈ నెల 19న రాత్రి 11.40 గంటల ప్రాంతంలో ప్లజెంట్‌వ్యాలీ వద్దకు వచ్చారు. బి-17కు వెళ్లాలంటూ సెక్యూరిటీ గేటు వద్ద సిబ్బందికి చెప్పి, నేరుగా స్మితా సభర్వాల్‌ నివాసం (బి-11) వద్దకు చేరుకున్నారు. బాబు కారులో ఉండగా, ఆనంద్‌కుమార్‌రెడ్డి ఆమె ఇంటి మొదటి అంతస్తులోకి వెళ్లి తలుపు తట్టాడు. నివ్వెరపోయిన ఆమె వెంటనే డయల్‌ 100కు సమాచారం ఇచ్చారు. ఈలోగా భద్రతా సిబ్బంది ఆనంద్‌కుమార్‌రెడ్డిని పట్టుకున్నారు. కాసేపటికి జూబ్లీహిల్స్‌ పోలీసులొచ్చి ఆనంద్‌ను, కారులో ఉన్న బాబును అదుపులోకి తీసుకొన్నారు. వారిపై ఐపీసీ సెక్షన్‌ 458, రెడ్‌ విత్‌ 34 కింద కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్‌ విధించారు. స్మితా సభర్వాల్‌ ఇంట్లోకి ప్రవేశించే ముందు.. రాత్రి 11.34 నిమిషాలకు ‘మీ ఇంటి గుమ్మం వద్ద ఉన్నా’ అంటూ ఆమెకు ఆనంద్‌ ట్వీట్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు