కరోనా ఎఫెక్ట్ ..వీడియో నాణ్యత హాంఫట్‌..!

కరోనా ఎఫెక్ట్ కారణంగా అకస్మాత్తుగా అంతర్జాల వినియోగం పెరిగింది. వైరస్‌ కట్టడిలో భాగంగా ఇళ్లకే పరిమితమైన చాలామంది ప్రజలు అంతర్జాలంలో గడుపుతున్నారు

Published : 21 Mar 2020 22:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా ఎఫెక్ట్ కారణంగా అకస్మాత్తుగా అంతర్జాల వినియోగం పెరిగింది. వైరస్‌ కట్టడిలో భాగంగా ఇళ్లకే పరిమితమైన చాలామంది ప్రజలు అంతర్జాలంలో గడుపుతున్నారు. ముఖ్యంగా భారత్‌లో మునుపెన్నడూ లేని విధంగా అంతర్జాల వినియోగం పెరిగిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  మనదేశంలో కరోనా కారణంగా చాలామంది ఉద్యోగులు, విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు.  కొందరు ఇళ్ల దగ్గర నుంచి తమ పనులు చేసుకుంటున్నారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ గణాంకాల ప్రకారం సగటు నెలవారీ వైర్‌లెస్‌ డేటా వినియోగం వచ్చే రెండు త్రైమాసికాలలో  17 శాతం పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి టెలికాం రంగ సంస్థలకు కొత్త చిక్కులు తెచ్చి పెట్టనుందని వారు అంటున్నారు.

వివిధ టెలికాం రంగ సంస్థల వద్ద డిమాండ్‌కు తగిన సప్లయ్‌ చేసే సామర్థ్యం లేదని  అంచనా వేస్తున్నారు. హెచ్‌డీ వీడియోలు, వీడియో కాల్స్‌కు అంతరాయం కలగవచ్చని భావిస్తున్నారు.  అయితే డిమాండ్‌కు తగ్గ సరఫరా చేసే సామర్థ్యం తమకు ఉందని కొన్ని సంస్థలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌ గణనీయంగా పెరిగింది. వివిధ దేశాలలో నెట్‌ వాడకం గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్‌ వాడకం పెరిగిందని ఆ సంస్థ సీఈవో మార్క్‌ జూకర్‌బర్గ్‌ తెలిపారు.

నూతన సంవత్సరం రోజు ఫేస్‌బుక్‌కు ఉండే డిమాండ్‌ను కరోనా అధిగమించిందని ఆయన వెల్లడించారు. ఐరోపా సమాఖ్యలో రాబోయే 30 రోజుల పాటు తమ వీడియో నాణ్యతను తగ్గించనున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌  వెల్లడించింది. దీని కారణంగా నెట్‌వర్క్‌ ట్రాఫిక్‌ 25 శాతం తగ్గుతుందని భావిస్తోంది. యూట్యూబ్‌ సైతం నెట్‌ఫ్లిక్స్‌ దారిలోనే పయణించనున్నట్లు ప్రకటించింది. డేటా ప్రసారాలకు సంబంధించి మౌలిక సదుపాయాలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వాలు వైఫై, హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేయాలని ఫైబర్‌ కేబుల్‌ విస్తరణకు సహకరించాలని టెలికాం సంస్ఠలు కోరుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని