సంతోష్‌ బాబు కుటుంబానికి రూ.5 కోట్లు

గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన కర్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం...

Published : 20 Jun 2020 01:42 IST

 ఆయన భార్యకు గ్రూప్‌-1 ఉద్యోగం
 తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటన

హైదరాబాద్‌: గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన కర్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరఫున సాయం ప్రకటించారు. సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల నగదు, నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్- 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తానే స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి సాయం అందించనున్నట్లు వెల్లడించారు. ఇదే ఘర్షణలో మరణించిన మిగతా 19 మంది కుటుంబ సభ్యులకు కూడా ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వనున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. కేంద్ర రక్షణ మంత్రి ద్వారా ఈ సాయాన్ని అందిస్తామని సీఎం వెల్లడించారు.

‘‘సరిహద్దుల్లో దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సైనికులకు యావత్ దేశం అండగా నిలవాలి. వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలి. తద్వారా సైనికుల్లో ఆత్మవిశ్వాసం, వారి కుటుంబాల్లో భరోసా నింపాలి. దేశమంతా మీ వెంటే ఉందనే సందేశం అందించాలి. వీర మరణం పొందిన సైనికులకు కేంద్ర ప్రభుత్వం ఎలాగూ సాయం చేస్తుంది. రాష్ట్రాలు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే సైనికులకు, వారి కుటుంబాలకు దేశం మా వెంట నిలుస్తుందనే నమ్మకం కుదురుతుంది. కరోనాతో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ మిగతా ఖర్చులు తగ్గించుకుని అయినా సైనికుల సంక్షేమానికి పాటు పడాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సందర్భంగా చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని