రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో విచారణ

రాయలసీమ ఎత్తిపోతలపై దాఖలైన ధిక్కరణ పిల్‌పై ఎన్జీటిలో విచారణ జరిగింది.

Updated : 21 Dec 2020 13:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : రాయలసీమ ఎత్తిపోతలపై దాఖలైన ధిక్కరణ పిల్‌పై ఎన్జీటిలో విచారణ జరిగింది. పనులు జరపొద్దని ఎన్జీటి ఆదేశాలిచ్చినా వాటిని ఉల్లంఘించారంటూ గవినోళ్ల శ్రీనివాస్‌ అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో ప్రాజెక్టు పనులు జరపడం లేదని ఎన్జీటికి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేవలం సమాయత్త పనులు, అధ్యయనాలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. పనులు జరగడం లేదని వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. ట్రైబ్యునల్‌ ఆదేశాలను సుప్రీంలో సవాలు చేశారా అని ప్రశ్నించింది.తాము సవాలు చేయలేదని బాధ్యతాయుత ప్రభుత్వంగా నిబంధనలను అనుగుణంగానే ముందుకు వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ఎన్జీటీకి వివరించారు. దీనిపై తదుపరి విచారణను జనవరి 18వ తేదీకి ఎన్జీటీ వాయిదా వేసింది.   
రాయలసీమ ఎత్తిపోతల పథకం పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టొదంటూ గతంలో ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ చెన్నై ధర్మాసనం ప్రాజెక్టుకు సంబంధించిన పనులపై ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

కాళేశ్వరం పనులు చేస్తే జలశక్తి శాఖకు ఫిర్యాదు చేయండి

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ విస్తరణ పనులు చేస్తున్నారంటూ తుమ్మలపల్లి శ్రీనివాస్‌ అనే వ్యక్తి వేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పైనా ఎన్జీటీలో విచారణ జరిగింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు విస్తరణ పనులు చేపట్టొద్దని ఎన్జీటీ గతంలో తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చినా విస్తరణ పనులు చేపడుతున్నారంటూ పిటిషన్‌ దాఖలైంది. దీనిపై స్పందించిన ఎన్జీటీ.. కాళేశ్వరం విస్తరణ పనులు చేస్తున్నారనిపిస్తే జలశక్తి శాఖకు ఫిర్యాదు చేయాలని పిటిషనర్‌కు సూచించింది. దీనిపై జలశక్తి అధికారులు చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఇవ్వాల్సిన ఆదేశాలు ఇదివరకే ఇచ్చినట్లు ఎన్జీటి స్పష్టం చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని