KCR: వైద్య విద్యలో నవశకం.. 9 మెడికల్‌ కళాశాలలు ప్రారంభం

తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన 9 వైద్య కళాశాలలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ వర్చువల్‌గా ప్రారంభించారు.

Updated : 15 Sep 2023 12:49 IST

హైదరాబాద్: రాష్ట్ర వైద్య విద్యలో నవశకం ప్రారంభమైంది. ఇప్పటికే పలువైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం.. తాజాగా మరో 9 మెడికల్‌ కళాశాలను ప్రారంభించింది. వికారాబాద్‌, సిరిసిల్ల, కరీంనగర్‌, ఖమ్మం, జనగామ, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, భూపాలపల్లిలో వైద్య కళాశాలలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఒకేసారి 9 కాలేజీలు ప్రారంభించడం శుభపరిణామమన్నారు.

‘‘ ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26 మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. రాబోయే సంవత్సరంలో మరో 8 వైద్య కళాశాలలు ప్రారంభిస్తాం. తెలంగాణ ప్రతి ఏటా 10 వేల మంది వైద్యులను దేశానికి అందించబోతోంది. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ప్రతి లక్ష జనాభాకు 22  మెడికల్‌ సీట్లు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 500 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. రాష్ట్రంలో 10 వేల సూపర్‌ స్పెషాలిటీ బెడ్లు అందుబాటులో ఉన్నాయి.’’ అని కేసీఆర్‌ అన్నారు.

పేద గర్భిణులకు కేసీఆర్‌ కిట్లు, న్యూట్రిషన్‌ కిట్లు అందిస్తున్నట్లు కేసీఆర్‌ గుర్తు చేశారు. ‘‘వారికి ఇబ్బంది లేకుండా అమ్మఒడి వాహనాలు ప్రారంభించాం. మతాశిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 76శాతం ప్రసవాలు జరుగుతున్నాయి.’’ అని కేసీఆర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావుతో సహా పలువురు మంత్రులు, ఆయా జిల్లాల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సిరిసిల్లలోని వైద్య కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని