MLAs Bribery case: సీబీఐకి బదిలీ చేయడమంటే.. కేసు అక్కర్లేదన్నట్టే: తెలంగాణ సర్కారు

ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు సింగిల్‌ జడ్జిని ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. 

Published : 04 Jan 2023 19:55 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ.. సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేయాలని కోరుతూ ప్రభుత్వంతో పాటు డీజీపీ, సిట్, సైబరాబాద్ సీపీ, రాజేంద్రనగర్ ఏసీపీ, మొయినాబాద్ పోలీసులు కలిసి అప్పీలు దాఖలు చేశారు. సింగిల్ జడ్జి పలు అంశాలను, సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోలేదని అప్పీలులో ప్రభుత్వం పేర్కొంది. సింగిల్ జడ్జి పిటిషన్‌పై తన పరిధిని కూడా దాటి ఆదేశాలు జారీ చేశారని తెలిపింది. ఈ కేసును కేంద్రం పరిధిలోని సీబీఐకి అప్పగించడమంటే.. కేసు అవసరం లేదన్నట్లేనని అప్పీలులో ప్రభుత్వం తెలిపింది. 

సీఎం వ్యాఖ్యలు జాతీయ పార్టీని ఉద్దేశించినవే తప్ప..

సిట్ రద్దు చేయాలని.. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును కొట్టివేయాలని పిటిషనర్లే కోరలేదని ప్రభుత్వం పేర్కొంది. సీబీఐకి ఇవ్వడానికి సీఎం మీడియా సమావేశాన్ని కారణంగా చూపడం తగదన్నారు. తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరిగిందని ఓ రాజకీయ పార్టీ నేతగా సీఎం మాట్లాడారని.. దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదంది. ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు నిందితుల కుట్రను దేశ ప్రజలకు తెలిపి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నంగానే సీఎం మీడియా సమావేశాన్ని చూడాలని అప్పీలులో ప్రభుత్వం వివరించింది. ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్, పబ్లిక్ డొమైన్‌లో ఉన్న ఇతర అంశాల ఆధారంగానే ముఖ్యమంత్రి మాట్లాడారని తెలిపింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు జాతీయ పార్టీని ఉద్దేశించినవే తప్ప.. దర్యాప్తునకు సంబంధంలేదని పేర్కొంది. సీఎంకు సీడీలు ఎలా చేరాయో మిస్టరీగా ఉందనేది పిటిషన్‌కు సంబంధం లేని అంశమని వివరించింది. స్వయంగా సీఎం వీడియోలను బహిరంగపరిచినందున సిట్ వేసినప్పటికీ పెద్దగా మార్పు ఉండదనడం ఊహాజనితమని పేర్కొంది. సీఎంకు సీడీలు ఎలా చేరాయో న్యాయవాదులెవరూ వివరించలేదనడం తప్పని.. పిటిషన్‌లో ముఖ్యమంత్రి ప్రతివాదిగా లేరు కాబట్టి ఆయన తరఫున ఎవరూ వాదించలేదని వివరించింది. పిటిషన్‌లో ప్రతివాదిగా లేని సీఎం వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవడం చట్టపరంగా తగదని తెలిపింది.

అభ్యంతరముంటే ఛార్జ్‌షీట్ వేశాక సవాల్ చేసుకోవచ్చు..

నిందితులకు దర్యాప్తు సంస్థలను ఎంచుకునే హక్కు ఉండదని అప్పీలులో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. సిట్‌పై ఆరోపణలు, అనుమానాలకు ఆధారాలేమిటో వివరించలేదని అభ్యంతరం వ్యక్తం చేసింది. యూట్యూబ్‌లోని వీడియోలను పరిగణనలోకి తీసుకోవడం చట్టబద్ధం కాదని పేర్కొంది. యూట్యూబ్‌లో వీడియోలు ఉండటం నిందితులకు న్యాయపరంగా నష్టమెలాగో వివరించలేదని తెలిపింది. ప్రభుత్వాన్ని కూల్చబోయారన్న ఇలాంటి తీవ్రమైన అంశాలపై మీడియా విస్తృత ప్రచారం ఆశ్చర్యమేమీ కాదని ప్రభుత్వం పేర్కొంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రపన్నిందేనని ఎఫ్‌ఐఆర్‌లో ప్రధాన సారాంశమని.. అలాంటప్పుడు కేంద్రం పరిధిలోని సీబీఐకి ఇవ్వడమంటే కేసు అవసరం లేదన్నట్లేనని అప్పీలులో ప్రభుత్వం పేర్కొంది. సింగిల్ జడ్జీ తీర్పు రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా ఉందని పేర్కొంది. చట్టానికి అనుగుణంగానే కేసు దర్యాప్తు సాగుతుందని.. నిందితులకు అభ్యంతరముంటే ఛార్జ్‌షీట్ వేశాక సవాల్ చేసుకోవచ్చునని పేర్కొంది. ప్రభుత్వ అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని