Suneetha Narreddy: ఆ సమయంలో వైఎస్‌ భారతి ఆందోళనగా కనిపించారు: వివేకా కుమార్తె సునీత

వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత సీబీఐకి కీలక విషయాలు వెల్లడించారు. ఆమె వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

Updated : 22 Jul 2023 15:30 IST

హైదరాబాద్: వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసుకు సంబంధించి పలు కీలక సాక్షుల వాంగ్మూలాలను గత నెల 30న సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించిన విషయం తెలిసిందే. ఆ విషయాలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. వివేకా కుమార్తె సునీత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పొందుపర్చిన కీలక అంశాలు తాజాగా బయటకు వచ్చాయి.

‘‘ఇంటికొచ్చి కలుస్తానంటూ 2019 మార్చి 22న వైఎస్‌ భారతి నాకు ఫోన్‌ చేశారు. నేను కడప, సైబరాబాద్‌ కమిషనరేట్‌ వెళ్లాల్సి ఉందని భారతికి చెప్పా. ‘ఎక్కువ సమయం తీసుకోను’ అంటూ భారతి మా ఇంటికి వచ్చేశారు. ఆమెతో పాటు విజయమ్మ, వైఎస్‌ అనిల్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి రావడంతో నేను ఆశ్చర్యపోయాను. లిఫ్ట్‌ వద్దే నిలబడి భారతితో మాట్లాడా. ఆ సమయంలో భారతి ఆందోళనగా కనిపించారు. నాన్న మరణించాక తొలిసారి ఇంటికొచ్చినందుకు బాధగా ఉన్నారని అనుకున్నా. ఇకపై ఏం చేసినా సజ్జల రామకృష్ణారెడ్డితో టచ్‌లో ఉండాలని భారతి చెప్పారు. మీడియాతో మాట్లాడాలని సజ్జల నాకు సూచించారు. సజ్జల ఆలోచన కొంత ఇబ్బందిగా అనిపించి నేరుగా మీడియాతో మాట్లాడకుండా ఒక వీడియో రికార్డు చేశా. నాన్న గది శుభ్రం చేసేటప్పుడు అక్కడే ఉన్న సీఐ శంకరయ్యపై ఫిర్యాదు చేస్తున్నట్లు వీడియో చేసి సజ్జలకు పంపించాను.

ప్రెస్‌మీట్‌ పెట్టాలని సజ్జల చెప్పారు..

వీడియో కాదు.. అంశానికి ముగింపు పలికేలా ప్రెస్‌మీట్‌ పెట్టాలని సజ్జల చెప్పారు. జగనన్నతో పాటు అవినాష్ పేరు కూడా ప్రస్తావించాలని సజ్జల సలహా ఇచ్చారు. నేను అప్పటివరకు అవినాష్‌ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. అవినాష్‌ పేరు ప్రస్తావించాలని సజ్జల చెప్పినప్పుడు కొంత సంకోచించా. అవినాష్‌ అభ్యర్థిత్వాన్ని మా నాన్న కోరుకోలేదని తెలుసు. రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా విభేదాలున్నాయి. సజ్జల సలహా మేరకు హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టా. గదిని శుభ్రం చేయడంపై దర్యాప్తు చేయాలని మొదటినుంచీ అడుగుతున్నా. పొరపాటు జరిగిందని తెలుసు.. క్రిమినల్‌ మైండ్‌ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోలేదు. జగనన్నను సీఎంగా చూడాలని నాన్న చాలా కష్టపడ్డారు. ఎవరో చేసిన పొరపాట్లవల్ల మళ్లీ జగన్ నష్టపోవాలా అని ఆలోచించా.

ఆ ఫిర్యాదుపై నేను సంతకం చేయలేదు..

మార్చురీ బయట ఉన్నప్పుడు ఓ ఫిర్యాదు రాసుకొచ్చి సంతకం చేయమన్నారు. ఆ ఫిర్యాదులో బీటెక్‌ రవి, ఇతర తెదేపా నేతలపై ఆరోపణలున్నాయి. వివేకా ఎన్నికల ప్రచారానికి తెదేపా నేతలు భయపడ్డారని అవినాష్ నాకు చెప్పారు. తెదేపా నేతలు మనసులో ఏదో పెట్టుకొని ఈ నేరానికి పాల్పడ్డారని అవినాష్‌ అన్నారు. ఆ ఫిర్యాదుపై నేను సంతకం చేయలేదు. 2019 జులైలో అవినాష్‌పై నాకు అసహనం మొదలైంది. మా కుమారుడికి ముందే తెలుసునని గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి తల్లి ఒకరితో చెప్పారు. మృతి విషయం బయటకు రాకముందే కుమారుడికి తెలుసునని ఆమె చెప్పారు. అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డికి ఉదయ్‌ ప్రధాన అనుచరుడు కాబట్టి ఆనుమానం వచ్చింది. భారతి, సజ్జల వాట్సప్‌ చాట్‌ స్క్రీన్‌షాట్‌లను సీబీఐకి ఇచ్చాను’’ అని వాంగ్మూలంలో సునీత పేర్కొన్నట్లు సీబీఐ.. తన నివేదికలో తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు