icon icon icon
icon icon icon

PM Modi: వైకాపా పాలనలో అభివృద్ధి సున్నా.. అవినీతి వందశాతం: మోదీ

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు.

Updated : 06 May 2024 17:55 IST

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (PM Modi) అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ‘గోదావరి మాతకు ప్రణామాలు.. ఈ నేల మీదే ఆదికవి నన్నయ్య తొలి కావ్యం రాశారు. ఇక్కడి నుంచే ఇప్పుడు కొత్త చరిత్ర లిఖించబోతున్నాం’ అంటూ మోదీ తెలుగులో తన ప్రసంగం ప్రారంభించారు. దేశంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

‘‘వైకాపా ప్రభుత్వం అవినీతిని జెట్‌ స్పీడ్‌తో పరిగెత్తించింది. అభివృద్ధి సున్నా.. అవినీతి వందశాతం. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని పూర్తిగా తిరస్కరిస్తారు. రాష్ట్రమైనా, దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఎన్డీయే ప్రభుత్వం ఉండాలి. వైకాపా సర్కారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. ఈ రాష్ట్రం ప్రతిభావంతులైన యువతకు నెలవు. టెక్నాలజీలో ఏపీ యువత శక్తిని ప్రపంచం గుర్తించింది. దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో రాష్ట్రం కూడా అంతే స్పీడ్‌తో అభివృద్ధి చెందాలి. కానీ, కేంద్ర ప్రాజెక్టుల అమలును రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసింది. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం. కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. పదేళ్ల క్రితం దేశాన్ని కాంగ్రెస్‌ పార్టీ అధోగతి పాలు చేసింది. ఈడీ.. ఈడీ.. అంటూ ఇండియా కూటమి గగ్గోలు పెడుతోంది. కాంగ్రెస్‌ నేతల వద్ద గుట్టల కొద్దీ డబ్బు బయట పడుతోంది. ఆ పార్టీ నేతల డబ్బును మెషీన్లు కూడా లెక్కపెట్టలేకపోతున్నాయి’’

మూడు రాజధానుల పేరిట ఏపీని లూటీ చేశారు..

‘‘మూడు రాజధానులు చేస్తామన్నారు.. చేయలేదు కానీ, మూడు రాజధానుల పేరిట ఏపీని లూటీ చేశారు. ఏపీలో మద్యం నిషేధిస్తామని అధికారంలోకి వచ్చిన వైకాపా.. గద్దె నెక్కిన తర్వాత మద్యం సిండికేట్‌గా తయారైంది. వైకాపా ప్రభుత్వానికి అవినీతి నిర్వహణ తప్ప.. రాష్ట్ర ఆర్థిక నియంత్రణ తెలియదు. రాష్ట్ర ఖజానాను వైకాపా ఖాళీ చేసింది. పోలవరం కోసం కేంద్రం రూ.15వేల కోట్లు ఇచ్చింది. కానీ, ఆ ప్రాజెక్టును ఈ ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. రైతుల ఆశలపై వైకాపా ప్రభుత్వం నీళ్లు చల్లింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పోలవరం సహా ఏపీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. రాజధానికి కేంద్రం రూ.15వేల కోట్లు ఇవ్వాలనుకుంది. కానీ, కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందుకోలేక పోయింది. ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక చరిత్ర ఉన్న భూమి. రాముడి చరిత్రను సినిమాల ద్వారా ఎన్టీఆర్‌ ఇంటింటికీ తీసుకెళ్లారు. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠను కాంగ్రెస్‌ బహిష్కరించింది. ఆ కార్యక్రమానికి వచ్చిన ఒక నేతను కాంగ్రెస్‌ బహిష్కరించింది. దిల్లీ- ముంబయి కారిడార్‌ మాదిరి విశాఖ-చెన్నై కారిడార్‌ నిర్మాణం చేపడతాం. విశాఖ-చెన్నై కారిడార్‌తో కాకినాడ పోర్టుకు సరకు రవాణా సులభతరం అవుతుంది. చెన్నై-కోల్‌కతా హైవే, రాజమహేంద్రవరం విమానాశ్రయం ఈ ప్రాంత ముఖచిత్రాన్ని మారుస్తాయి. ఏపీకి మోదీ గ్యారంటీ, చంద్రబాబు నేతృత్వం, పవన్‌ విశ్వాసం ఉన్నాయి. కూటమి అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపించాలి. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు కోసం కూటమికి ఓటేయండి ’’ అని మోదీ విజ్ఞప్తి చేశారు.

దేశానికి గుండె ధైర్యం మోదీ: పవన్‌ కల్యాణ్‌

అయోధ్యకు శ్రీరామచంద్రుడిని తీసుకొచ్చిన మహానుభావుడు నరేంద్రమోదీ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. భారత సమాజానికి గుండె ధైర్యమే మోదీ అని కొనియాడారు. పదేళ్ల పాలనలో శత్రువులు భారత్‌వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు. ‘‘ భారత్‌ శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి ప్రధాని మోదీ. ఆయన గొంతెత్తితే దేశంలో అణువణువూ స్పందిస్తోంది. కేంద్ర పథకాలను వైకాపా తన పథకాలుగా చెప్పుకొంటోంది. కేంద్ర పథకాలను జగన్‌ అందిపుచ్చుకోలేకపోయారు. ఐదు కోట్ల మంది ప్రజలను హింసించారు. కేంద్రం ఇచ్చే ఇళ్లకు జగనన్న కాలనీలు అని పేరు పెట్టుకున్నారు. ఏపీలో లక్షలాది మంది యువత ఉన్నారు. దేశానికి జాతీయ జెండాను అందించిన నేల ఇది. మోదీ వికసిత్‌ భారత్‌ కలలో మేమూ భాగస్వాములవుతాం. గతంలో పద్మఅవార్డులు రాజకీయాలు చేసే వారికే వచ్చేవి. కానీ, మోదీ ప్రధాని అయిన తర్వాత అర్హులైన వారికే దక్కుతున్నాయి’’ అని పవన్‌ అన్నారు.

నరేంద్రమోదీ విశ్వజీత్‌: లోకేశ్‌

 ప్రధాని నరేంద్ర మోదీ విశ్వజీత్‌ ( విశ్వాన్ని జయించినవారు) అని నారా లోకేశ్‌ అన్నారు. భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుతున్నారని చెప్పారు. ‘‘దేశానికి మోదీ అవసరం ఎంతో ఉంది. దేశం దశ.. దిశ మార్చింది ‘NAMO’ అనే నాలుగు అక్షరాలు. వికసిత్‌ భారత్‌ మోదీ కల.. వికసిత్‌ ఏపీ బాబు, పవన్‌ కల. పొత్తు కోసం త్యాగం చేసి పవన్‌ కల్యాణ్‌ తొలి అడుగు వేశారు.

226 రోజులపాటు 3వేల కి.మీపైగా పాద యాత్ర చేసి.. ప్రజల కష్టాలను చూశాను. తెదేపా హయాంలో రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించాం. విశాఖను ఐటీ హబ్‌గా చేశాం. యువతకు ఉపాధి ఎలా అందించాలో చంద్రబాబుకు బాగా తెలుసు. జగన్‌ పాలనలో మొదటి బాధితులు యువతే. కొత్త కంపెనీలు తేకపోగా.. పాత కంపెనీలను వెళ్లగొట్టారు. మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు కూడా ఇవ్వలేకపోయింది’’ అని లోకేశ్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img