Radhika Khera: నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు

కాంగ్రెస్‌ను వీడిన అనంతరం రాధికా ఖేడా పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు.

Published : 06 May 2024 18:10 IST

దిల్లీ: కాంగ్రెస్‌ను వీడిన అనంతరం రాధికా ఖేడా పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. చత్తీస్‌గఢ్‌లోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో కొందరు కాంగ్రెస్‌ నాయకులు తనను గదిలో బంధించి దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.  

సోమవారం విలేకరుల సమావేశంలో రాధిక మాట్లాడుతూ ‘‘మా ఇంట్లో రాముడి జెండాను పెట్టిన రోజు నుంచి కాంగ్రెస్ నాపై దాడి చేస్తుంది. పార్టీ నాయకులు నన్ను ఎప్పుడూ అవమానిస్తూ ఉండేవారు. రాహుల్ గాంధీ న్యాయ యాత్ర  ఛత్తీస్‌గఢ్‌లో సాగుతున్న సమయంలో మీడియా ఛైర్మన్ సుశీల్ గుప్తా తాగిన స్థితిలో మా ఇంటికి వచ్చి తలుపులు తట్టారు. నాకు మద్యం ఇవ్వాలని చూశారు. అనంతరం ఏప్రిల్‌ 30న నేను రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో సుశీల్ ఆనంద్ శుక్లాతో మాట్లాడటానికి వెళ్లాను. అప్పుడు కూడా ఆయన నన్ను దుర్భాషలాడారు. మరో ఇద్దరు నాయకులతో కలిసి నన్ను గదిలో బంధించి దాడి చేశారు. భయంతో ఎంత అరిచినా ఎవరూ తలుపు తీయలేదు. పార్టీ నాయకులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు’’ అని తెలిపారు.

అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించినందుకు కాంగ్రెస్‌ నేతల నుంచి తాను వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు తెలుపుతూ ఆదివారం రాధికా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖలో ‘‘మతాన్ని సమర్థించేవారికి వ్యతిరేకత ఎదురవుతుందని పురాతన కాలం నుంచి స్పష్టమవుతోంది. దీనిపై అనేక ఉదాహరణలు ఉన్నాయి. అదేరీతిలో.. శ్రీరాముడి పేరును జపించిన వారిని ప్రస్తుతం కొందరు వ్యతిరేకిస్తున్నారు. హిందువులందరికీ రాముడి జన్మస్థలం పరమపవిత్రమైంది. రామ్‌లల్లా దర్శనంతో తమ జీవితం ధన్యమైందని ఈ మతస్థులు భావిస్తారు. కొందరు మాత్రం దాన్ని వ్యతిరేకిస్తున్నారు’’ అంటూ రాసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని