
AP HighCourt: ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై సుమోటోగా హైకోర్టు విచారణ
అమరావతి: రాష్ట్రంలో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల ఉపసంహరణ అంశంలో హైకోర్టు సుమోటోగా విచారణ జరిపింది. వైకాపా ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, విడదల రజని, జక్కంపూడి రాజా, మేకా వెంకటప్రతాప్ అప్పారావు, మల్లాది విష్ణు, ఎంపీ మిథున్రెడ్డి, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై నమోదైన క్రిమినల్ కేసులను ఉపసంహరించినట్లు రాష్ట్ర హోంశాఖ గతంలో జీవోలు జారీ చేసింది. దీనిపై సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది.
కేసుల ఉపసంహరణకు సంబంధించిన జీవోలు విడుదల చేసిన రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి తమకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ప్రజాప్రతినిధులకు సంబంధించి ఎన్ని కేసులు ఉపసంహరణకి ప్రతిపాదనలు వచ్చాయో నివేదిక ఇవ్వాలని ఆ కేసుల విచారణ జరుపుతున్న విజయవాడ ప్రత్యేక కోర్టును హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 24కి వాయిదా వేసింది.
Advertisement