Ts corona: తెలంగాణలో భారీగా పెరిగిన కొవిడ్‌ కేసులు

తెలంగాణలో కొవిడ్‌ మహమ్మారి మరోసారి తన ప్రతాపం చూపిస్తోంది. గతేడాది జూన్ తరువాత మొదటి సారి రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 1000 మార్క్‌ దాటింది

Updated : 04 Jan 2022 20:54 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కొవిడ్‌ మహమ్మారి మరోసారి తన ప్రతాపం చూపిస్తోంది. గతేడాది జూన్ తరువాత మొదటి సారి రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 1000 మార్క్‌ దాటింది. గడిచిన 24 గంటల్లో 42,991 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,052 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,84,023కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 4,033కు చేరింది. కరోనా బారి నుంచి నిన్న 240 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,858 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కొత్తగా 10 ఒమిక్రాన్‌ కేసులు..

రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 10 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 144కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌, నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి 127 మంది శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్‌జీఐఏ) చేరుకున్నారు. వారందరికీ కొవిడ్‌ ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయగా 8 మంది ప్రయాణికులకు పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు.

ఇప్పటివరకు ఎట్‌ రిస్క్‌, నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన 13,405 మంది ప్రయాణికులకు ఆర్‌జీఐఏలో కొవిడ్ ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేశారు. వారిలో 189 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వారందరి శాంపిల్స్‌ని అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. వారిలో 45 మందికి ఒమిక్రాన్‌ నెగెటివ్‌గా తేలింది. మిగిలిన 144 మందికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలింది. చికిత్స అనంతరం ఒమిక్రాన్‌ బాధితుల్లో 37 మంది కోలుకున్నారు. మరో 50 మంది ఫలితాలు రావాల్సి ఉందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని