Suicide: అన్నతో నిశ్చితార్థం.. తమ్ముడితో పెళ్లి.. నవ వధువు ఆత్మహత్య

నవ వధువు అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన సంఘటన బాలాపూర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.

Updated : 09 Aug 2021 10:43 IST

పహాడీషరీఫ్, న్యూస్‌టుడే: నవ వధువు అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన సంఘటన బాలాపూర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌ వివరాల తెలిపిన ప్రకారం... పాతబస్తీ వట్టెపల్లికి చెందిన షబ్బీర్‌ అలీ కుమార్తె షాహిన్‌బేగం(25)తో జల్‌పల్లి న్యూబాబానగర్‌ నివాసి మీర్‌ ఇస్మాయిల్‌ఉద్దీన్‌ అలీకి 28 రోజుల క్రితం వివాహం జరిగింది. మూడేళ్లక్రితమే ఇస్మాయిల్‌ఉద్దీన్‌ అలీ అన్నయ్యతో ఆమెకు నిశ్చితార్థమైంది. అనంతరం సోదరులిద్దరూ ఉపాధి నిమిత్తం దుబాయికి వెళ్లారు. కరోనా నేపథ్యంలో అతడు ఇంటికి రాలేదు. నెలన్నర క్రితం తమ్ముడు ఇస్మాయిల్‌ ఉద్దీన్‌ అలీ తిరిగివచ్చాడు.

పెద్ద కుమారుడి ఆచూకీలేకపోవడంతో రెండు కుటుంబాల పెద్దలు చర్చించి షాహిన్‌బేగంను ఇస్మాయిల్‌ ఉద్దీన్‌ అలీకి ఇచ్చి జులై 12న పెళ్లి చేశారు. సోదరుడికి నిశ్చితార్థమైన అమ్మాయితో తనకు వివాహం చేశారంటూ అలీ తీవ్రంగా మదనపడేవాడు. భార్యగా అంగీకరించలేనంటూ ఆమెను మానసికంగా వేధించేవాడు. దీనికితోడు కట్నకానుకల విషయమై అత్తమామల నుంచి సైతం వేధింపులు తీవ్రమయ్యాయి. దీంతో కలత చెందిన షాహిన్‌ బేగం శనివారం తన గదిలోని ఫ్యానుకు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని