Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Updated : 12 Nov 2021 17:00 IST

1. న్యాయమైన వాటా కావాలి.. గొంతెమ్మ కోరికలు కోరడం లేదు: హరీశ్‌రావు

ఏడేళ్లుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి సాయం అందలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేటలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. కృష్ణా జల వివాద పరిష్కారం కోసం కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై నిన్న కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి హరీశ్‌రావు వివరణ ఇచ్చారు.

2. ‘పాప పరిహార యాత్ర’ అని పెట్టుకుంటే బాగుండేది: పేర్ని నాని

రైతుల ముసుగులో చేస్తున్న అమరావతి పాదయాత్ర హాస్యాస్పదమని ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అమరావతి మహా పాదయాత్ర పేరు ‘పాప పరిహార యాత్ర’ అని పెట్టుకుని ఉంటే బాగుండేదని విమర్శించారు. చంద్రబాబు బినామీలు, ఏజెంట్లు రైతుల ముసుగులో యాత్ర చేస్తున్నారని ఆరోపించారు.

3. కేంద్రం అన్నీ అమ్ముతోంది.. వడ్లు మాత్రం కొనట్లేదు: కేటీఆర్‌

బియ్యం ఎగుమతి చేసే అధికారం రాష్ట్రాలకు లేదని.. కేంద్రమే ధాన్యం కొని ఎగుమతి చేయాల్సి ఉందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. అన్నీ అమ్మాలి.. వడ్లు కొనొద్దనేది భాజపా విధానమని ఎద్దేవా చేశారు. యాసంగిలో వరి వద్దే వద్దని కేంద్ర ప్రభుత్వం మొండికేసిందని ఆయన ఆక్షేపించారు. కేంద్రం యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనన్న డిమాండ్‌తో సిరిసిల్లలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు.

4. జాయింట్‌ స్టాఫ్ కౌన్సిల్‌ భేటీని బహిష్కరించిన ఉద్యోగ సంఘాలు

పీఆర్‌సీ అమలు సహా ఉద్యోగుల ఇతర డిమాండ్ల అమలుపై మరోసారి జరుగుతున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌ భేటీ నుంచి పలు ఉద్యోగ సంఘాలు బయటికొచ్చాయి. ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి బయటికి వచ్చేశారు. ఈ సమావేశంలో సీఎస్‌ కాకుండా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, ఇతర అధికారులు మాత్రమే హాజరయ్యారు. దీంతో ప్రభుత్వ వైఖరిపై ఆయా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. 

5. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లిన సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్‌ వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లారు. ఇటీవల ఇంట్లో వ్యాయామం చేస్తున్న సమయంలో కుడి కాలుకు వాపు వచ్చింది. ఈ నేపథ్యంలో చికిత్స కోసం తాడేపల్లిలోని మణిపాల్‌ ఆస్పత్రికి ఆయన వెళ్లారు. సీఎంకు వైద్యులు ఎంఆర్‌ఐ స్కానింగ్‌తో పాటు ఇతర సాధారణ పరీక్షలు నిర్వహించారు. సుమారు 2 గంటలపాటు ఆస్పత్రిలోనే ఉన్న జగన్‌.. అనంతరం తిరిగి క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు.

6. సీనియర్లకు విశ్రాంతి.. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టిదే

న్యూజిలాండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇందులో సీనియర్‌ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది.  విరామం లేకుండా ఆడుతున్న విరాట్ కోహ్లి, రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమి వంటి కీలక ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతినివ్వడంతో.. అంజిక రహానెకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఛెతేశ్వర్‌ పుజారాను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. రెండో టెస్టుకు విరాట్ కోహ్లి అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ ప్రకటించింది.

7. చిన్నారులకు టీకా, బూస్టర్‌ డోసు ఎప్పుడు వేస్తారంటే..?

చిన్నారులకు కరోనా టీకా అందించే విషయంలో తాము తొందరపడకూడదని నిర్ణయించుకొన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అన్నారు. ఈ విషయంలో నిపుణుల సూచన మేరకు ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో కరోనా టీకాకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. 

8. అఫ్గాన్‌ పరిణామాలపై భారత్‌ చర్చ.. స్వాగతించిన తాలిబన్లు!

గతకొంత కాలంగా అఫ్గాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై ఎనిమిది దేశాలతో భారత్‌ జరిపిన చర్చలను తాలిబన్లు స్వాగతించారు. అంతేకాకుండా అఫ్గాన్‌ వేదికగా ఇతర దేశాలకు ఎటువంటి ముప్పు వాటిల్లదని ప్రపంచ దేశాలకు మరోసారి హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు. భారత్‌లో జరిగిన సమావేశంలో పలు దేశాలు ప్రస్తావించిన అంశాలను ఇప్పటికే నెరవేర్చినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ అఫ్గాన్‌ సంక్షోభ నివారణకు భారత్‌ జరిపిన చొరవను తాలిబన్లు ప్రశంసించారు.

9. జన్‌ధన్‌ ఖాతాలను హ్యాక్‌ చేసి.. రూ.6వేల కోట్లు దోచుకున్నారు..!

బిట్‌కాయిన్‌ కుంభకోణం వ్యవహారం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ వ్యవహారంలో భాజపా నేతలున్నట్లు విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి మరిన్ని సంచలన ఆరోపణలు చేశారు. బిట్‌కాయిన్‌ స్కామ్‌ నిందితుడు.. జన్‌ధన్‌ ఖాతాలను హ్యాక్‌ చేసి వాటి నుంచి రూ.6వేల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. 

ఇంట్లో ఉన్న అబ్బాయి పోరాడకుండా కూర్చున్నాడు..!

10. జయాపజయాలను మనం నిర్ణయించలేం : బాబర్ ఆజామ్‌

టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ముందుకు సాగుతున్న పాకిస్థాన్‌ జోరుకు.. రెండో సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కళ్లెం వేసింది. మాథ్యూ వేడ్ (41) సంచలన ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో ఆసీస్‌ ఫైనల్‌కు చేరుకుంటే.. ఓటమి పాలైన పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి అనంతరం పాక్‌ కెప్టెన్‌ బాబర్ ఆజామ్ డ్రెస్సింగ్‌ రూమ్‌లో మాట్లాడాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని