Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Updated : 06 Dec 2021 12:58 IST

1. హమ్మయ్య.. బ్రిటన్‌ నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్‌ లేదు..

బ్రిటన్‌ నుంచి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళకు ఒమిక్రాన్‌ నెగెటివ్‌గా నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. జీనోమ్‌ సీక్వెన్స్‌ రిపోర్టులో మహిళకు నెగెటివ్‌ వచ్చినట్లు వెల్లడించారు. కాగా మరో 12 మంది బ్రిటన్‌ నుంచి వచ్చిన ప్రయాణికుల జీనోమ్‌ రిపోర్టు రావాల్సి ఉందని చెప్పారు. జీనోమ్‌ సీక్వెన్స్‌ ఫలితంలో నెగెటివ్‌ వచ్చిన మహిళకు కరోనా నిర్ధరణ కావడంతో ఆమె టిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. 

2. ‘అమ్మఒడి’పై తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయుల లేఖలు

అమ్మఒడి పథకం అందాలంటే 75శాతం హాజరు తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని అమలు చేసే క్రమంలో ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులకు లేఖలు రాస్తున్నారు. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు వెళ్తున్నాయి. మీ పిల్లల హాజరు 75శాతం ఉండేలా చూడాలని ప్రధానోపాధ్యాయుల లేఖలో సూచిస్తున్నారు.

3. బహిరంగ సభకు అనుమతివ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తాం: శివారెడ్డి

ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న ‘మహాపాదయాత్ర’ నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. 36వ రోజు యాత్రను రైతులు వెంగమాంబపురం నుంచి ప్రారంభించారు. ఇవాళ్టి యాత్ర మాటమడుగు, బంగారుపల్లి మీదుగా సాగనుంది. బంగారుపల్లిలో మధ్యాహ్న భోజన విరామం తీసుకోనున్న రైతులు రాత్రికి వెంకటగిరిలో ఇవాళ్టి యాత్రను ముగించనున్నారు.

4. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుమ్మగట్ట మండలం పూలకుంట వద్ద ఆటోను జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రాయదుర్గం నుంచి వెళ్తు్న్న ఆటో.. గోనబావి నుంచి వస్తున్న జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 

5. ఈటల భూముల అంశం.. కబ్జా నిజమే: మెదక్‌ కలెక్టర్‌

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కుటుంబానికి చెందిన జమునా హేచరీస్‌ అసైన్డ్‌ భూములను కబ్జా చేసిందని మెదక్‌ కలెక్టర్‌ అన్నారు. 70.33 ఎకరాలు కబ్జా చేసినట్లు సర్వేలో తేలిందని చెప్పారు. ఈటల భూముల అంశంపై కలెక్టర్‌ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ‘‘56 మంది అసైనీల భూములను కబ్జా చేసినట్లు తేలింది. అచ్చంపేట, హకీంపేట పరిధిలో అసైన్డ్‌ భూముల కబ్జా జరిగింది. జమునా హేచరీస్‌ యాజమాన్యం అక్రమంగా కబ్జా చేసింది. అసైన్డ్‌ భూములను వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్నారు’’ అని కలెక్టర్‌ చెప్పారు.

6. గుజరాత్‌ అల్లర్లపై.. సీబీఎస్‌ఈ ప్రశ్నపత్రం దుమారం!

సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు 2002 గుజరాత్‌ అల్లర్లపై అడిగిన ప్రశ్నపత్రం దుమారం రేపింది. తప్పు తెలుసుకున్న బోర్డు ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. ఇటీవల 12వ సోషియాలజీ పేపర్‌లో 2002 అల్లర్ల సమయంలో గుజరాత్‌ రాష్ట్రాన్ని ఏ పార్టీ పాలిస్తోందని అడిగారు.

7. వ్యాక్సినేషన్‌లో మరో మైలురాయి.. ఈ వేగాన్ని ఇలాగే కొనసాగిద్దాం : మోదీ

దేశంలో కరోనా టీకా కార్యక్రమం నిరాటంకంగా సాగుతోంది. దేశ వయోజనుల జనాభాలో 50 శాతం మందికిపైగా రెండు డోసుల టీకా అందింది. ఆదివారం నాటికి భారత్‌ ఈ మైలురాయిని దాటినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా స్పందించారు. ‘భారత టీకా కార్యక్రమం మరో మైలురాయిని దాటింది. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుపుతోన్న పోరాటాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ వేగాన్ని కొనసాగించడం ముఖ్యం’ అని పిలుపునిచ్చారు.

8. రెండో టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా 372 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 140/5 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగోరోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్‌ మరో 27 పరుగులే జోడించి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. ఆట ప్రారంభమైన గంటలోపే ఆ జట్టు 167 పరుగులకు కుప్పకూలింది. సోమవారం ఉదయం జయంత్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు తీయగా అశ్విన్‌ చివరి వికెట్ తీశాడు.

9. సాధారణ పరిస్థితులు మళ్లీ వస్తాయా?

కరోనా కల్లోలం రెండేళ్లుగా ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పుడు ఒమిక్రాన్‌ రూపంలో కొత్త కలవరం మొదలైంది. ఎప్పటికప్పుడు వైరస్‌ కొత్త రూపాలు పుట్టుకొస్తూ ఉంటే.. ఈ మహమ్మారి అంతమై.. మళ్లీ సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయి? అన్న భయాందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రశ్నకు సమాధానాలు వెతికే పనిలో ఉన్న బ్రిటన్‌లోని ఆఫీస్‌ ఫర్‌ నేషనల్‌ స్టాటిస్టిక్స్‌(ఓఎన్‌ఎస్‌) ప్రజలకు తరచూ ప్రశ్నలు సంధిస్తూ వస్తోంది. 

10. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు 29ఏళ్లు.. అయోధ్య, మథురలో భారీ బందోబస్తు!

అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు నేటితో 29ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్య, మథుర నగరాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత రోజును విశ్వహిందు పరిషత్‌ ‘శౌర్య దివాస్‌’గా.. ముస్లిం వర్గాలు ‘బ్లాక్‌ డే’గా పరిగణిస్తుంటాయి.  అయితే,  2018లో అయోధ్యపై సుప్రీంకోర్టు కీలక తీర్పుతో సమస్య పరిష్కారమైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని