విహారయాత్రకు వెళ్తున్నారా.. ఇవి పాటించండి!

కొన్ని నెలల పాటు కరోనా, లాక్‌డౌన్‌ నిబంధనలు ప్రజలను సతమతం చేశాయి. ఇప్పుడు దాదాపు అన్ని కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన చాలా మంది సరదాగా ఎక్కడికైనా విహారయాత్రలకు వెళ్లాలని ప్రణాళికలు వేస్తున్నారు. క్రిస్మస్‌, నూతన సంవత్సర

Updated : 13 Dec 2020 14:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొన్ని నెలల పాటు కరోనా, లాక్‌డౌన్‌ నిబంధనలు ప్రజలను సతమతం చేశాయి. ఇప్పుడు దాదాపు అన్ని కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన చాలా మంది సరదాగా ఎక్కడికైనా విహారయాత్రలకు వెళ్లాలని ప్రణాళికలు వేస్తున్నారు. క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకల్ని కొత్త ప్రాంతంలో జరుపుకోవాలని భావిస్తున్నారు. అయితే, విహారయాత్రలకు గతంలోలాగా ఇలా వెళ్లి అలా వచ్చే పరిస్థితులు మాత్రం ఇప్పుడు లేవు. కరోనా కారణంగా మీ విహారయాత్ర ప్రణాళికలో కొత్తగా కొన్ని అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి.. సురక్షితంగా విహారయాత్రకు వెళ్లాలంటే ఈ ఐదు చిట్కాలు పాటించండి.

వెళ్లే ప్రాంతంపై ఆరా

విహారయాత్ర కోసం ఎక్కడికి వెళ్లాలో ముందుగానే ఆలోచించి ఉంటారు కదా! అయితే, ఆ ప్రాంతంలో కరోనా వ్యాప్తి ఏ విధంగా ఉందో ముందు తెలుసుకోండి. రోజువారీ కేసులు ఎన్ని వస్తున్నాయి. కేసులు పెరుగుతున్నాయా..? తగ్గుతున్నాయా?వంటి విషయాలు గమనించండి. లక్షల మందిలో నలుగురికి లేదా అంతకంటే తక్కువ మందికి కరోనా సోకే అవకాశలున్న చోట్లకు విహారయాత్రలకు వెళ్లొచ్చని పలు ట్రావెల్‌ వెబ్‌సైట్లు పేర్కొంటున్నాయి.

ఎలా వెళ్తున్నారు?

లాక్‌డౌన్‌ విధించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కొన్ని నెలల పాటు ప్రజారవాణా నిలిచిపోయింది. నిబంధనల సడలింపుతో తిరిగి విమానాలు, బస్సులు, రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, కరోనా కట్టడి, ప్రయాణికుల క్షేమం కోసం ఆయా యాజమాన్యాలు కృషి చేస్తున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగత జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిందే. రద్దీగా ఉన్న బస్సులు, రైళ్లను ఎక్కే ప్రయత్నం చేయకండి. వీలైనంత వరకు రద్దీ తక్కువ ఉన్న సమయాల్లో ప్రయాణాలు చేయండి. శానిటైజ్‌ చేసుకోవడం, మాస్క్‌ ధరించడం తప్పనిసరి. ఒకవేళ కారులో సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్తున్నట్లయితే.. ఇతర ప్రాంతాల్లో ఆగకుండా వెళ్లండి. తినడానికి కావాల్సిన ఆహారాన్ని ముందుగానే తెచ్చిపెట్టుకోండి.

కరోనా పరీక్ష.. క్వారంటైన్‌

ఇప్పుడు పర్యటక రంగంలో కరోనా పరీక్ష చేయడం తప్పనిసరైంది. విహారయాత్రకు వెళ్లేముందు.. అక్కడికి వెళ్లిన తర్వాత కరోనా పరీక్ష చేస్తున్నారు. కొన్నిచోట్ల ముందుగానే చేయించుకున్న కరోనా పరీక్ష ఫలితాలను చూపించాల్సి వస్తుండగా.. మరికొన్ని చోట్ల అక్కడికి వెళ్లిన తర్వాత పరీక్ష నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ కరోనా పరీక్షలకు పూర్తిగా సహకరించండి. విహారయాత్రకు వెళ్లే ముందే కరోనా సోకిందని తెలిస్తే.. ప్రయాణాన్ని విరమించుకొని క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకోవాలి. ఒకవేళ విహారయాత్రకు వెళ్లిన తర్వాత అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ వస్తే అక్కడి అధికారుల సూచనల మేరకు కొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. క్వారంటైన్‌లో ఉండాల్సిన రోజులు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటున్నాయి. కాబట్టి కరోనా లక్షణాలు ఉన్నా.. లేకున్నా పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధంగా ఉండండి.

రద్దీ ఉన్న చోటకు వెళ్లకండి

అన్ని అడ్డంకులు దాటుకొని వెళ్లాల్సిన ప్రాంతానికి వెళ్లినా.. సందర్శన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా బారిన పడే అవకాశముంది. కరోనా గాలి ద్వారా కూడా సోకుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీసం 6 అడుగుల దూరం పాటించాలని సూచిస్తున్నారు. కాబట్టి సందర్శక ప్రాంతాల్లో పర్యటకులు ఎక్కువగా ఉన్న చోట సామాజిక దూరం పాటించండి. ఇందుకోసం ముందుగానే పర్యటకులు తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకోండి. ఎలాగూ జనసంచారం ఎక్కువగా ఉండే పార్కులు, మ్యూజియం వంటివి ఇంకా మూసివేసే ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో జాగ్రత్త వహించండి.

హోటల్స్‌.. రిసార్ట్స్‌లో

విహారయాత్రకు వెళ్లిన చోట హోటల్స్‌ లేదా రిసార్ట్స్‌లో బస చేయాల్సి ఉంటుంది. వీటి యాజమాన్యాలు కరోనా నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నాయో లేదో తెలుసుకోండి. ఎక్కడికక్కడ శానిటైజర్లను అందుబాటులో ఉంచారా లేదా? భోజనం చేసే చోట సామాజిక దూరం పాటిస్తున్నారా? హోటల్‌ సిబ్బంది గదులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారా?గమనించండి. గదుల్లో ఉండే టీవీ రీమోట్లు, ఇతర వస్తువులను మీరు వాడేముందు శానిటైజ్‌ చేయండి. తెలియని వ్యక్తులతో వీలైనంత దూరంగా ఉండి మాట్లాడండి.

ఇవీ చదవండి..

ఇంటి నుంచి కాదు.. విదేశాల నుంచి పని చేస్తారా?

అక్కడ పర్యటిస్తే ట్రావెల్‌ పాయింట్లు ఇస్తారట!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని