Jammu Kashmir: కశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. లష్కరే తొయిబా కమాండర్‌ హతం

జమ్మూ- కశ్మీర్‌లో ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు పోలీసులు, భద్రతాదళాలు ముమ్మర చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం పుల్వామా జిల్లాలోని పాంపోర్ ప్రాంతం ద్రంగ్‌బల్‌లో పోలీసులు, భద్రతా దళాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో...

Updated : 13 May 2022 17:25 IST

శ్రీనగర్‌: జమ్మూ- కశ్మీర్‌లో ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు పోలీసులు, భద్రతాదళాలు ముమ్మర చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం పుల్వామా జిల్లాలోని పాంపోర్ ప్రాంతం ద్రంగ్‌బల్‌లో పోలీసులు, భద్రతా దళాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో లష్కరే తొయిబా కమాండర్ ఉమర్ ముస్తాక్‌ ఖండేతోపాటు మరో ఉగ్రవాది హతమయ్యారు. స్థానిక పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సదరు ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం మేరకు ఈ ఆపరేషన్‌ మొదలుపెట్టినట్లు చెప్పారు. ఎన్‌కౌంటర్ అనంతరం వారి వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రినీ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

పోలీసుల హత్య కేసులో నిందితుడు..

ఈ ఏడాది ఆగస్టులో కశ్మీర్‌ పోలీసులు విడుదల చేసిన టాప్‌- 10 ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉమర్ ముస్తాక్ ఖండే పేరూ ఉంది. ఇటీవల శ్రీనగర్‌లో ఇద్దరు పోలీసులను హత్య చేసిన కేసులోనూ ఇతను నిందితుడని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. కశ్మీర్‌ లోయలో నిన్న సాయంత్రం నుంచి ఇది మూడో ఎన్‌కౌంటర్ కాగా, వారం వ్యవధిలో చేపట్టిన తొమ్మిదో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్. మొత్తం 13 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. కశ్మీర్‌లో ఇటీవల వరుసగా జరిపిన ఉగ్ర దాడుల్లో పలువురు పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో బలగాలు భారీ ఎత్తున తనిఖీలు చేపడుతున్నాయి. ప్రజల్లో భయాన్ని సృష్టించేందుకు, లోయలో అల్లర్లు, గందరగోళాన్ని వ్యాప్తి చేసేందుకు యత్నిస్తున్న ముష్కరుల ఏరివేతకు కట్టుబడి ఉన్నామని పోలీసులు ట్వీట్ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని