ఆ తర్వాతే టీకాకు అనుమతి ఇవ్వండి..!

నిశిత పరిశీలన, సరైన శాంపిల్ పరిమాణంలో ప్రయోగాలు జరిపిన తర్వాతే ఏ టీకాకైనా అత్యవసర వినియోగం కింద అనుమతి ఇవ్వాలని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి నివేదించింది.

Published : 21 Dec 2020 21:33 IST

పార్లమెంటరీ కమిటీ నివేదిక

దిల్లీ: నిశిత పరిశీలన, సరైన శాంపిల్ పరిమాణంలో ప్రయోగాలు జరిపిన తర్వాతే ఏ టీకాకైనా అత్యవసర వినియోగం కింద అనుమతి ఇవ్వాలని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి నివేదించింది.  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ నేతృత్వంలో ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ రూపొందించిన నివేదికలో తాజా అంశాలను ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దేశంలో అత్యవసర వినియోగ అనుమతిని సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్ కంట్రోల్‌ ఆర్గనేజైషన్‌ (సీడీఎస్‌సీఓ) ఇప్పటివరకు ఎవ్వరికీ ఇవ్వలేదని కమిటీ గుర్తుచేసింది. అందుకే అన్ని దశల క్లినికల్‌ ప్రయోగాలు పూర్తై, నిశితంగా పరిశీలన, నిపుణుల సంప్రదింపుల తర్వాతే ఏదైనా వ్యాక్సిన్‌కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలాంటి విధానాన్ని వినియోగించుకోవాలని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది.

కరోనా విజృంభణ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులే ఎనలేని భారాన్ని మోశాయని.. ప్రైవేటు ఆసుపత్రులు మాత్రం సామాన్యులకు అందుబాటులో లేవని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. అందుకే ప్రైవేటు ఆసుపత్రులపై నిరంతర పర్యవేక్షణ, నియంత్రణ ఉండాలని పేర్కొంది. ప్రైవేటు ఆసుప్రతులపై పర్యవేక్షణ కొనసాగించడంతో పాటు మందులు బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోకుండా ఉండేందుకు ఓ సమగ్ర ప్రజారోగ్య చట్టం ఉండాలని రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుకి అందించిన నివేదికలో పార్లమెంటరీ కమిటీ వెల్లడించింది. వీటితో పాటు తక్కువ ధరలకు లభించే ఔషధాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. అంతేకాకుండా సమాజంలో అట్టడుగు వర్గాల వారికి తక్కువ ధరకు లేదా సబ్సిడీతో కూడిన మందులను అందుబాటులో ఉంచేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొంది.  

కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగంపై ఇప్పటికే మూడు సంస్థలు కేంద్ర నియంత్రణ సంస్థలకు దరఖాస్తు చేసుకున్న సమయంలోనే తాజా నివేదిక వెల్లడి కావడం గమనార్హం. ఇప్పటికే తాము అభివృద్ధిచేసిన కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌, ఫైజర్‌ సంస్థలు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇవి అందించిన టీకా ప్రయోగాల సమాచారాన్ని సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్ కంట్రోల్‌ ఆర్గనేజైషన్‌(సీడీఎస్‌సీఓ) విశ్లేషిస్తోంది.

ఇవీ చదవండి..
కొత్తరకం కరోనాపై టీకా పనిచేస్తుందా?
కొత్తరకం వైరస్‌పై WHO ఏమందంటే..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని