Bypolls: యూపీలో భాజపాకు బిగ్‌ బూస్ట్‌.. పంజాబ్‌లో ఆప్‌కు భంగపాటు

ఐదు రాష్ట్రాల్లో మూడు లోక్‌సభ, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో భాజపాకు సానుకూల ఫలితాలు వచ్చాయి.

Published : 26 Jun 2022 21:13 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో మూడు లోక్‌సభ, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో భాజపాకు సానుకూల ఫలితాలు వచ్చాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటగా ఉన్న రెండు లోక్‌సభ స్థానాలను భాజపానే కైవసం చేసుకుంది. ఇక పంజాబ్‌లో అధికారం చేపట్టామని సంతోషంలో ఉన్న ఆమ్‌ఆద్మీపార్టీకి మూడు నెలల తిరగకుండానే భంగపాటు తప్పలేదు. ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ రాజీనామాతో ఖాళీ అయిన సింగ్రూర్‌ లోక్‌సభ స్థానాన్ని శిరోమణి అకాలీదళ్‌ చేజిక్కించుకుంది. త్రిపురలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు గానూ మూడింట్లో భాజపా విజయం సాధించగా.. కాంగ్రెస్‌ మరో స్థానంలో గెలుపొందింది. మరోమూడు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌, వైకాపా గెలుపొందాయి.

ఎస్‌పీ కంచుకోటకు బీటలు..

ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత అఖిలేశ్‌ యాదవ్‌, ఆజంఖాన్‌ రాజీనామాలతో రాంపుర్‌, ఆజంగఢ్‌ లోక్‌సభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ స్థానాల్లో జూన్‌ 23న ఉపఎన్నిక జరగ్గా.. ఆదివారం లెక్కింపు జరిగింది. ఇందులో రాంపుర్‌ లోక్‌సభ స్థానంలో భాజపా అభ్యర్థి ఘన్‌శ్యామ్‌ లోధి 42వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ స్థానం నుంచి 2019లో ఎస్పీ సీనియర్‌ నేత ఆజంఖాన్‌ గెలుపొందారు. ఇక మరో కీలకమైన ఆజంగఢ్‌ లోక్‌సభ స్థానాన్ని కూడా 8679 ఓట్ల తేడాతో సమాజ్‌వాదీ పార్టీ కోల్పోయింది. అయితే, ఈ రెండు లోక్‌సభ స్థానాలకు రాజీనామా చేసిన అఖిలేశ్‌ యాదవ్‌, ఆజంఖాన్‌లు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే.

మరోవైపు పంజాబ్‌లో సంగ్రూర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్‌ అభ్యర్థి సిమ్రాన్‌జిత్‌ సింగ్‌ విజయం సాధించారు. ఇక్కడ నుంచి పోటీ చేసిన ఆప్‌ నేతపై ఆయన ఐదు వేల మెజారిటీ పొందారు. అయితే, ఇంతకుముందు రెండుసార్లు ఈ స్థానంలో ప్రస్తుత ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ గెలుపొందడం విశేషం.

త్రిపురలో భాజపాదే పైచేయి..

దేశవ్యాప్తంగా ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగ్గా.. వాటిలో నాలుగు స్థానాలు త్రిపురలోనే ఉన్నాయి. తాజా ఫలితాల్లో భాజపా మూడు స్థానాల్లో గెలుపొందింది. టౌన్‌ బార్డోవాలీ స్థానం నుంచి పోటీ చేసిన త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహాతో పాటు జుబరాజ్‌నగర్‌, సుర్మా స్థానాల్లోనూ భాజపా అభ్యర్థులు విజయం సాధించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మాణిక్‌ సాహా, బిప్లబ్‌ దేబ్‌ రాజీనామాతో సీఎంగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. మరో కీలక స్థానమైన అగర్తలా భాజపా సిట్టింగ్‌ స్థానం కాగా.. తాజా ఫలితాల్లో అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి సుదీప్‌ రాయ్‌ బర్మాన్‌ 3వేల ఓట్లతో గెలుపొందారు. దీంతో త్రిపుర ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఖాతా తెరిచినట్లయ్యింది.

దిల్లీ రాజిందర్‌ నగర్‌కు జరిగిన ఉప ఎన్నికలో ఆమ్‌ఆద్మీ పార్టీ నేత దుర్గేశ్‌ పథక్‌ విజయం సాధించారు. భాజపా ప్రత్యర్థి రాజేష్‌ భాటియాపై 11వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఝార్ఖండ్‌లోని మందార్‌ నియోజకవర్గ (జేవీఎం సిట్టింగ్‌ స్థానం) నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి శిల్పి నేహా టిర్కీ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి (భాజపా)పై 23వేల ఓట్ల మెజారిటీ సాధించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఘన విజయం సాధించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు లోక్‌సభ స్థానాల్లో భాజపా విజయం సాధించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం చారిత్రాత్మకమైందన్న ఆయన.. యూపీ ప్రజలు డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారనే విషయం తాజా ఫలితాల ద్వారా తెలుస్తోందన్నారు. మరోవైపు కుటుంబ, కులతత్వ పార్టీలను ఆమోదించేందుకు ప్రజలు సిద్ధంగా లేరనే విషయం తాజా ఫలితాల ద్వారా తేటతెల్లమవుతోందని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని