Delhi Weather: దిల్లీ గజ గజ... నేటి నుంచి మరో కోల్డ్‌ స్పెల్‌

దేశ రాజధాని దిల్లీ, పరిసర ప్రాంతాల్లో మరోసారి కోల్డ్‌ స్పెల్‌ ఏర్పడే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. నేటి నుంచి మూడు రోజుల పాటు ఇది కొనసాగుతుందని, ఫలితంగా మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.

Published : 16 Jan 2023 02:00 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు మరో కోల్డ్‌ స్పెల్‌ ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ క్రమంలో మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. వరుసగా కొన్ని రోజుల పాటు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే దీనిని ఓల్డ్‌ స్పెల్‌గా వ్యవహరిస్తారు. ఈ నెల 5 నుంచి 9 తేదీల మధ్య ఏర్పడిన కోల్డ్‌ స్పెల్‌లో దిల్లీ పరిసర ప్రాంతాల్లో వరుసగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన పదేళ్లలో ఇంతటి తక్కువ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇది రెండోసారి. ఐఎండీ  తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 15 రోజుల్లో 50 గంటలపాటు పొగమంచు కురిసింది. 2019 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో మంచు కురవడం ఇదే తొలిసారి. ఈ నెల 10 నుంచి క్రమంగా పెరిగిన ఉష్ణోగ్రతలు.. వాయవ్య ప్రాంతం మీదుగా వస్తున్న గాలులతో మరోసారి తగ్గుముఖం పట్టాయి.

రానున్న 5 రోజుల్లో దిల్లీతోపాటు పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దట్టమైన మంచు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ వెల్లడించింది. వాయవ్య ప్రాంతం మీదుగా వీస్తున్న చలిగాలుల వల్ల జనవరి 18 వరకు ఆయా ప్రాంతాల్లో రెండు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. వదులుగా, పొరలుపొరలుగా ఉండే దుస్తులు ధరించాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. ఇళ్లల్లో ఉష్ణోగ్రతలను సమతుల్యం చేసేలా రూమ్‌ హీటర్లు ఏర్పాటు చేసుకోవాలని కోరింది. జనవరి 18 తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశముందని ఐఎండీ అధికారి ఒకరు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని