Shashi Tharoor: జారిపడ్డ శశిథరూర్‌..కాలికి గాయం

పార్లమెంట్‌లో మెట్లు దిగుతుండగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ జారి పడ్డారు. దీంతో ఆయన ఎడమ కాలి మడమ బెణికింది. వైద్యుల సూచన మేరకు ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

Published : 16 Dec 2022 15:41 IST

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌(Shashi Tharoor) కాలికి గాయమైంది. గురువారం పార్లమెంట్ (Parliament) సమావేశాలకు హాజరైన ఆయన.. మెట్లు దిగుతుండగా కాలుజారి కిందపడ్డారు. ఈ క్రమంలో ఎడమ కాలి మడమ బెణికింది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. నడవలేని పరిస్థితిలో ఉన్నందున నియోజవర్గ పరిధిలో తాను హాజరుకావాల్సి ఉన్న కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు శశిథరూర్‌(Shashi Tharoor) ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. కాలికి పాస్లర్‌ వేసి ఉన్న కొన్ని ఫొటోలను షేర్‌ చేశారు.

‘‘ఒకింత అసౌకర్యానికి గురయ్యాను. పార్లమెంట్‌లో మెట్లు దిగుతున్నప్పుడు కాలు జారింది. ఎడమకాలి మడమ కాస్త బెణికింది. కొద్దిసేపు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, నొప్పి తీవ్రం కావడంతో ఆస్పత్రికి వెళ్లాను. ప్రస్తుతం నడవలేని పరిస్థితిలో ఉన్నాను. నియోజవర్గంలో కార్యక్రమాలను రద్దు చేసుకున్నాను’’ అని శశిథరూర్ ట్విటర్‌లో పోస్టు చేశారు. దీనిపై పలువురు యూజర్లు స్పందిస్తున్నారు. వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ‘‘ మీ ఆరోగ్యం జాగ్రత్త సార్‌. ఈ వయస్సులో ఆరోగ్యంపై మీరు మరింత శ్రద్ధ పెట్టాలి.’’ అని ఒక యూజర్‌ కామెంట్‌ చేయగా.. ‘‘పార్లమెంట్‌లో మీరు లేని లోటు పూడ్చలేదు. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నాం’’ అంటూ మరొకరు స్పందించారు. ఆయన తొందరగా కోలుకోవాలంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని