oxygen సరఫరాకు ఆటంకం కలిగిస్తే..: దిల్లీ హైకోర్టు

దేశరాజధాని దిల్లీ కొవిడ్ గుప్పిట్లో చిక్కుకుపోయింది. అక్కడ రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి.

Updated : 24 Apr 2021 14:21 IST

జీవించడం ప్రజల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసిన కోర్టు

దిల్లీ: దేశరాజధాని దిల్లీ కొవిడ్ గుప్పిట్లో చిక్కుకుపోయింది. అక్కడ రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. ఆసుపత్రుల్లో పడకల కొరత ఉండగా, ఇప్పటికే ప్రాణాపాయ స్థితిలో చేరిన వారికి ఆక్సిజన్ లభ్యత లేక ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. దీనిపై ఇప్పటికే పలు ఆసుపత్రులు దిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. తాజాగా మరో ఆసుపత్రి కూడా కోర్టు మెట్లక్కడంతో ఆ సంఖ్య ఆరుకు చేరింది. కాగా, ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతపై దిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎవరైనా ప్రాణవాయువు సరఫరాకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలను తప్పవని హెచ్చరించింది. ‘ఇది సెకండ్‌ వేవ్‌ కాదు, సునామీ. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తారస్థాయి చేరలేదు. మే నెల మధ్యలో ఆ సంఖ్యను దాటవచ్చు. అందుకు  ఎలా సిద్ధమవుతున్నాం’ అని దిల్లీ హైకోర్టు ప్రశ్నించింది.

ప్రస్తుతం రాజధాని నగరానికి 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ లభించకపోతే వ్యవస్థ కుప్పకూలిపోతుందని విచారణలో భాగంగా దిల్లీ ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది. కొరత కారణంగా గత 24 గంటల్లో దారుణమైన ఘటనలు కళ్ల ముందు కనిపించాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. నిన్న కేవలం 297 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే కేంద్రం నుంచి లభించిందని తెలిపింది. 

దీనిపై స్పందించిన కోర్టు.. దిల్లీకి 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఎప్పుడు లభిస్తుందంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. అలాగే ఆక్సిజన్ సరఫరాకు అడ్డుపడే వారి వివరాలు ఇవ్వాలని దిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వెంటనే సొంతంగా ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేయాలని వెల్లడించింది. ప్రాణవాయువు అందించలేకపోవడాన్ని నేరపూరిత చర్యగా అభివర్ణించిన కోర్టు..జీవించడం ప్రజల ప్రాథమిక హక్కని ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. సరఫరాకు ఆటంకం కలిగిస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని