మహారాష్ట్ర మాజీ హోంమంత్రిపై ఈడీ కేసు!

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఆయనపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌.........

Updated : 21 Dec 2022 15:19 IST

ముంబయి: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఆయనపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. త్వరలో ఆయన నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రదేశాల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అలాగే త్వరలో అనిల్ దేశ్‌ముఖ్‌తో పాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరికొంత మందికి విచారణ నిమిత్తం ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అనంతరం వారంతా ఈడీ ముందు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది.

అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయని సీబీఐ గత నెల 24న వెల్లడించింది. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పేర్కొంది. ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.వంద కోట్లు వసూలు చేయాలంటూ సస్పెండైన పోలీసులను అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదేశించినట్లు పరంబీర్‌ సింగ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. పోలీసు అధికారుల బదిలీల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. వీటిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ పరంబీర్‌ సింగ్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన కోర్టు.. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ బృందం అనిల్‌ దేశ్‌ముఖ్‌తో పాలు పలువురు అధికారుల్ని విచారించి కేసు నమోదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని