Taliban in Afghanistan: అమెరికా వదిలేసిన ‘టైం’బాంబ్‌.. అఫ్గాన్‌..!

అఫ్గానిస్థాన్‌ గడ్డ పై నుంచి చివరి అమెరికన్‌ సైనికుడు కూడా నిన్న రాత్రే వెళ్లిపోయారు. తాలిబన్‌ ప్రత్యేక దళాలు కాబుల్‌ ఎయిర్‌పోర్టును ఆక్రమించుకొన్నాయి.

Updated : 31 Aug 2021 16:58 IST

తాలిబన్లకు పాలన ఆషామాషీ కాదు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

అఫ్గానిస్థాన్‌ గడ్డ పై నుంచి చివరి అమెరికన్‌ సైనికుడు కూడా నిన్న రాత్రే వెళ్లిపోయారు. తాలిబన్‌ ప్రత్యేక దళాలు కాబుల్‌ ఎయిర్‌పోర్టును ఆక్రమించుకొన్నాయి. అక్కడ అమెరికా పనికిరాకుండా చేసి వదిలేసిన విమానాలు, హెలికాప్టర్లను పరిశీలించారు. అనంతరం గాల్లోకి తుపాకులు కాల్చి సంబరాలు కూడా చేసుకొన్నారు. ఇక తాలిబన్ల చేతికి అఫ్గాన్‌ పగ్గాలు పూర్తిగా వచ్చేశాయి. దేశాన్ని పరిపాలించి.. ప్రజల సమస్యలను తీర్చాల్సిన సమయం ఆసన్నమైంది. తాలిబన్లకు ఇదే అసలైన సవాలు. 

వార్‌లార్డ్స్‌, జాతినేతల ముఠాలను కలిపి తాలిబన్లు అంటారు. ఒకరు చెప్పిన మాట మరో వర్గం వినాల్సిన సమయం.. అప్పుడే సమన్వయం ఉంటుంది. ఉదాహరణకు..‘మహిళలతో ఎలా ప్రవర్తించాలో మా ఫైటర్లకు తెలియదు.. కొన్నాళ్లు ఇళ్లలోనే ఉండండి’ అంటూ కొన్నాళ్ల క్రితం తాలిబన్‌ ప్రతినిధి చేసిన ప్రకటన వారిలోని సమన్వయ లోపానికి చిహ్నం. తాలిబన్‌ ప్రతినిధిగా ఉన్న వ్యక్తికి పట్టుఉంటే ‘మహిళలను ఏమీ అనవద్దు’ అని ఫైటర్లను ఆదేశిస్తే చాలు. కానీ, అతను అలా చేయలేదు. పాలన మొత్తం ఇదే పరిస్థితి కొనసాగితే మళ్లీ 1990ల నాటి దుస్థితి తలెత్తుతుంది. 

ప్రజల అనుమానాలను తీర్చి నమ్మకం కలిగించాలి..

తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించిన సమయంలో శాంతి మంత్రం పఠించారు. తాము మారిపోయామని వారు చెప్పిన మాటలను ప్రజలు విశ్వసించేలా భవిష్యత్తులో వారి ప్రవర్తన ఉండాలి. 1996 నుంచి 2001 మధ్యలో వీరు మహిళలు, మైనారిటీలపై చేసిన అరాచకాలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఈసారి పాలనలో తాలిబన్లు ఉదారవాదాన్ని తెస్తామని ప్రపంచానికి చెప్పారు. 

అన్ని వర్గాలకు పాలనలో భాగస్వామ్యం..

ఇప్పటికే దేశంలో ప్రభుత్వం కూలిపోయి రెండు వారాలవుతోంది. తీవ్రమైన అస్థిరత రాజ్యమేలుతోంది. ఎవరు ఏమిటో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్ల చర్చలు కొలిక్కి రాలేదు. ఐరాసతో సహా పలు ప్రపంచ దేశాలు అఫ్గాన్‌ పాలనలో దేశంలోని అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఉంటేనే గుర్తిస్తామని చెబుతున్నాయి. తాలిబన్లు కూడా దీనిపై సానుకూలంగానే స్పందించారు. ఇప్పటికే మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌, మాజీ నేత అబ్దుల్లా అబ్దుల్లా, గుల్బుద్దీన్‌ హిక్మత్యార్‌ వంటి నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే షియా వర్గాలతో చర్చలు జరిపేందుకు ప్రతినిధులను పంపారు.  అంతేకాదు.. వీరితో జరిగే ఒప్పందాలను దీర్ఘకాలం కొనసాగించకపోతే అంతర్యుద్ధం తప్పదు. 

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే..

అఫ్గాన్‌ ఆర్థిక పరిస్థితే అన్నిటికంటే అధ్వానంగా ఉంది. చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేకపోవడం, 9 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం అమెరికా సీజ్‌ చేయడంతో నిధుల కొరత తీవ్రంగా ఉంది. దేశంలో మంచినీటి వ్యవస్థ, కమ్యూనికేషన్లు, రోడ్ల నిర్వహణ, ఉద్యోగుల జీతాలు వంటి వాటికి కూడా నిధులు లేవు. 

దీనికి తోడు విదేశాల నుంచి వచ్చే సహాయ నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. బ్యాంకుల్లో నుంచి డబ్బు తీసుకొనేందుకు ప్రజలు ఏటీఎంల ఎదుట బారులు తీరిననట్లు బీబీసీ పేర్కొంది. 

అఫ్గాన్‌ జీడీపీలో దాదాపు 40శాతం విదేశీ సహాయ నిధులే కావడం గమనార్హం. చాలా దేశాలు అఫ్గాన్‌ నిధులు మంజూరును సస్పెండ్‌ చేశాయి. ఈ ప్రభావం తాలిబన్‌ కరెన్సీపై ప్రతికూలంగా పడుతుంది. చాలా తక్కువ దేశాలు మాత్రమే అఫ్గానిస్థాన్లో దౌత్య కార్యాలయాలను కొనసాగిస్తున్నాయి. దీంతో పాక్‌,ఇరాన్‌,చైనా,కతర్‌,రష్యాలపైనే తాలిబన్లు ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. 

ఉగ్రమూకకు అడ్డాగా మారకుండా..

అమెరికా పై యుద్ధం పేరుతో ఇప్పటికే దాదాపు 10వేల మంది పాక్‌ ఉగ్ర మూకలు అఫ్గాన్‌ గడ్డపై తిష్టవేశాయి. దీనికి తోడు ఒసామా బిన్‌ లాదెన్‌ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేసిన అమిన్‌ ఉల్‌ హక్‌ ఇప్పటికే అఫ్గాన్‌లోని నాంగ్రహార్‌ ప్రావిన్స్‌కు చేరుకొన్నాడు. అతను అల్‌-ఖైయిదా ఆయుధ కొనుగోలు విభాగానికి అధ్యక్షుడు కూడా. తాలిబన్‌- అల్‌ ఖైయిదా మధ్య సాంస్కృతిక, వివాహ సంబంధాలు ఉన్నట్లు ఐరాస నివేదిక పేర్కొంది. ఇక ఐసిస్‌-కె ఉండనే ఉంది. ఈ ఉగ్ర సంస్థ దాడుల నుంచి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత తాలిబన్లపై పడింది. ఇన్నాళ్లు ఆ పని నాటో దళాలు చూసేవి. వారికున్న సాంకేతికత.. ఇంటెలిజెన్స్‌ సమాచారం.. కమ్యూనికేషన్లు తాలిబన్లకు లేవనే చెప్పాలి. ఇక అఫ్గాన్‌ భూభాగాన్ని విదేశీ శక్తులు వాడుకోకుండా చూస్తామని తాలిబన్లు చెప్పిన మాట ఎంత వరకు నిలబెట్టుకొంటాయో చూడాలి. వాస్తవానికి దీని అమలు ఆధారంగానే విదేశీ సహాయ నిధులు లభించే అవకాశం ఉంది. 

నిపుణుల వలసలు..

తాలిబన్ల ఆక్రమణ మొదలు కాగానే.. అఫ్గాన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న డాక్టర్లు ,అధ్యాపకులు, ఇంజినీర్లు, విశ్వవిద్యాలయ విద్యార్థులు, బ్యూరోక్రాట్లలో అత్యధిక మంది దేశం దాటేశారు. ఈ మేధోవలస దీర్ఘకాలం పాటు అఫ్గాన్‌ అభివృద్దిని కుంటుబరచనుంది. ఒక దశలో పరిస్థితి అర్థం చేసుకొన్న తాలిబన్‌ ప్రతినిధి మేధావులు దేశం వీడొద్దని కోరారు. డాక్టర్లు, ఇంజినీర్ల అవసరం దేశానికి ఉందని వారన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని