సోషల్‌ మీడియాపై ట్రంప్‌ ఉక్కుపాదం..!

సామాజిక మాధ్యమ సంస్థలకు సంబంధించి చట్టపరమైన రక్షణలను తొలగించే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. సామాజిక మాధ్యమ సంస్థలు ఆన్‌లైన్‌ కంటెంటును తనిఖీ చేస్తే చర్యలు తీసుకునేలా ఈ ఆర్డర్‌ తీసుకొచ్చారు.

Published : 29 May 2020 18:12 IST

ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం..

వాషింగ్టన్‌: సామాజిక మాధ్యమ సంస్థలకు ఇప్పటివరకు ఉన్న చట్టపరమైన రక్షణలను తొలగించే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. సామాజిక మాధ్యమ సంస్థలు ఆన్‌లైన్‌ కంటెంటును తనిఖీ చేస్తే చర్యలు తీసుకునేలా ఈ ఆర్డర్‌ తీసుకొచ్చారు. ఈ ఆర్డర్‌ ద్వారా సర్వీస్‌ ప్రొవైడర్ల నిబంధనల ప్రకారం, ఏ రకమైన కంటెంట్ నిరోధాన్ని మోసపూరితమైందిగా లేదా అస్థిరమైందిగా పరిగణిస్తారో తెలపాలని ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌(ఎఫ్‌సీసీ)ని కోరింది.

‘వ్యక్తుల లేదా గ్రూపుల మధ్య జరిగే చర్చలను మార్పు చేయడం, తొలగించడం, దాచి పెట్టడం, నియంత్రించడం వంటి విశేష అధికారాలు ఈ టెక్నాలజీ కంపెనీలకు ఉన్నాయి. భవిష్యత్తులో దీన్ని పునరావృతం కానివ్వం’ అని డొనాల్డ్‌ ట్రంప్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అంతేకాకుండా అమెరికా ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించేందుకే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ అని ట్రంప్‌ వెల్లడించారు.

ఒకవేళ ఇది చట్టంగా మారితే మాత్రం సామాజిక మాధ్యమాలను కూడా ప్రచురణకర్తలుగానే పరిగణించే అవకాశం ఉంది. అంతేకాకుండా సోషల్‌ మీడియా వేదికలపై యూజర్లు వెల్లడించే విషయాలకు సదరు కంపెనీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో వ్యక్తులు చేసే కామెంట్లకు సదరు వెబ్‌సైట్‌ లేదా సోషల్‌ మీడియా సంస్థలు 1996 చట్టం ప్రకారం బాధ్యత వహించవు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇక సోషల్‌ మీడియా సంస్థలు ఈ స్వేచ్ఛను కోల్పోయే అవకాశం ఉంది.

ఈ మధ్యే డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విటర్‌లో చేసిన కామెంట్‌పై ట్విటర్‌ ఫ్యాక్ట్‌చెక్‌ చేపట్టడాన్ని ట్రంప్‌ తీవ్రంగా పరిగణించారు. అంతేకాకుండా, సోషల్‌ మీడియాపై చర్యలు ఉంటాయని హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డరుకు ఉపక్రమించారు. అయితే, ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై మాత్రం విమర్శకుల నుంచి వ్యతిరేకత మొదలైంది. సెక్షన్‌ 230 ప్రకారం ప్రైవేటు ఇంటర్నెట్‌ ఆపరేటర్లను నియంత్రించే అధికారం ట్రంప్‌కు లేదని అంటున్నారు. ఇది సోషల్ మీడియా కంపెనీలపై కఠినమైన, రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌ అభిప్రాయపడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని