మిస్ట‌రీ: 2నెలల్లో 350 ఏనుగుల‌ మృతి!

ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ ప‌ట్టిపీడిస్తున్న స‌మ‌యంలోనే వంద‌ల సంఖ్య‌లో ఏనుగులు మృత్యువాత‌ప‌డ‌టం క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఆఫ్రికా ఖండంలోని బోస్ట్వానాలో గ‌డిచిన రెండు నెలల్లోనే దాదాపు 350ఏనుగులు మ‌ర‌ణించిన‌ట్లు బ‌య‌ట‌ప‌డింది. అయితే, అవి మాన‌వులు వేటాడటం వ‌ల్ల ...

Published : 02 Jul 2020 21:36 IST

ఆఫ్రికా అడ‌వుల్లో ప‌డి ఉన్న ఏనుగుల మృత‌దేహాలు

ఆంత్రాక్స్ ప్ర‌భావం ఉండొచ్చంటున్న శాస్త్రవేత్త‌లు!

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ ప‌ట్టిపీడిస్తున్న స‌మ‌యంలోనే వంద‌ల సంఖ్య‌లో ఏనుగులు మృత్యువాత‌ప‌డ‌టం క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఆఫ్రికా ఖండంలోని బోస్ట్వానాలో గ‌డిచిన రెండు నెలల్లోనే దాదాపు 350ఏనుగులు మ‌ర‌ణించిన‌ట్లు గుర్తించారు. అయితే, అవి మాన‌వులు వేటాడటం వ‌ల్ల చ‌నిపోయిన ఆన‌వాళ్లు క‌నిపించ‌లేద‌ని శాస్త్రవేత్త‌లు ప్రాథ‌మికంగా గుర్తించారు. ఇలా వంద‌ల సంఖ్య‌లో ఏనుగులు ఏ కార‌ణంగా చ‌నిపోతున్నాయ‌నే విష‌యం ప్ర‌స్తుతం మిస్ట‌రీగా మారింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అక్క‌డి ప్ర‌భుత్వం కార‌ణాల‌ను క‌నుగొనే ప‌నిలోప‌డింది.

ఈ స్థాయిలో ఏనుగులు చనిపోవడానికి వేటగాళ్లే కారణమని మొదట భావించారు. ఇక‌వేళ వేట‌గాళ్లు జ‌రిపే విష‌ప్ర‌యోగాలవ‌ల్ల వేరే జంతువులు కూడా మ‌ర‌ణించాలి. కానీ, ఇక్క‌డ అలాంటి దాఖ‌లాలేవి క‌నిపించ‌లేదు. అంతేకాకుండా ఏనుగుల దంతాలు అలాగే ఉండ‌డంతో వీటి మ‌ర‌ణానికి ‌మరేదో కారణమై ఉంటుందన్న నిర్ధారణకు వచ్చారు. గ‌తంలో ఈ ప్రాంతంలో ఏనుగుల‌పై ఆంత్రాక్స్‌, వేట‌గాళ్ల‌ విషప్ర‌యోగం ఘ‌ట‌న‌ల‌ను కొట్టిపారేయ‌లేమ‌ని ప‌రిశోధ‌కులు అభిప్రాయ‌డుతున్నారు.

తొలుత మే నెల ప్రారంభంలో బ్రిట‌న్‌కు చెందిన ప‌రిశోధ‌కుడు డాక్ట‌ర్ నియాల్‌ మెకాన్ 'ఒక‌వాంగో డెల్టా' ప్రాంతంలో విమానంలో ప్రయాణిస్తూ 169 ఏనుగు మృతదేహాలను గుర్తించారు. దాదాపు మూడు గంటలపాటు కొన‌సాగిన ఈ ప్రయాణంలో అధిక సంఖ్యలో ఏనుగులు అచేతనంగా పడి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే అక్క‌డి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. అనంతరం నెలరోజుల పాటు చేసిన పరిశోధనలో దాదాపు 356 ఏనుగు మృతదేహాలను క‌నుగొన్నారు. చ‌నిపోయిన వాటిలో భిన్న‌ వ‌య‌స్సుగ‌ల ఏనుగులు, ఆడ, మ‌గవీ ఉన్న‌ట్లు గుర్తించారు. వీటి మ‌ర‌ణానికి క‌చ్చిత‌మైన కార‌ణం తెలియ‌న‌ప్ప‌టికీ ఏనుగుల నాడీ వ్య‌వ‌స్థ‌పై ఏదో దాడి చేయ‌డంవ‌ల్లే ఇవి మ‌ర‌ణిస్తున్న‌ట్లు అనుమానిస్తున్నారు. విగ‌త‌జీవులుగా ప‌డి ఉన్న వాటి ముఖాల‌ను ప‌రిశీలిస్తే ఇదేవిష‌యం అర్థమవుతోంద‌ని డాక్ట‌ర్ నియాల్‌ మెకాన్ అభిప్రాయ‌ప‌డ్డారు.

వంద‌ల సంఖ్య‌లో ఏనుగుల‌ మ‌ర‌ణానికి క‌చ్చిత‌మైన కార‌ణాల‌ను పరీక్షా నివేదిక‌లు వ‌చ్చాకే తెలుస్తుంద‌ని అక్క‌డి ప్రాంతీయ వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ స‌మ‌న్వ‌య‌క‌ర్త డిమాక‌ట్సో షేబీ మీడియాకు వెల్ల‌డించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ ప్రాంతంలో దాదాపు 356ఏనుగులు చ‌నిపోయిన‌ట్లు నివేదిక‌లు వెల్ల‌డిస్తుండ‌గా వాటిలో ఇప్ప‌టివ‌ర‌కు 275 మ‌ర‌ణాల‌ను ధ్రువీక‌రించామ‌ని జాతీయ వ‌న్య‌ప్రాణి, ఉద్యాన‌వ‌నశాఖ డైరెక్టర్ సిరిల్ ట‌వోలో ప్ర‌క‌టించారు. ఆంత్రాక్స్‌తో చ‌నిపోతున్నాయ‌ని ఇంకా ధ్రువీక‌రించాల్సి ఉంద‌న్నారు. చ‌నిపోయిన ఏనుగుల నుంచి శాంపిళ్ల‌ను సేక‌రించి వాటిని ద‌క్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన‌డాల్లోని ల్యాబ్‌ల‌కు పంపించామ‌ని తెలిపారు.

ఇదిలా ఉంటే, ఆఫ్రికా ఖండంలో మొత్తం ఏనుగుల‌లో మూడింట ఒక‌వంతు బోస్ట్వానాలోనే ఉన్న‌ట్లు నివేదిక‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. 1990ద‌శ‌కంలో వీటిసంఖ్య 80వేలు ఉండ‌గా ప్ర‌స్తుతం ల‌క్షా 30వేల‌కు పెరిగిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. అయితే, వేటగాళ్ల‌ కార‌ణంగా ఆఫ్రికాలో ఈ మ‌ధ్య‌ ఏనుగుల సంఖ్య త‌గ్గుతున్న‌ట్లు నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని