Choksi: చోక్సీకి డొమినికా కోర్టులో ఎదురుదెబ్బ‌

వ‌జ్రాల వ్యాపారీ మెహుల్ చోక్సీకి డొమినికా హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. చోక్సీ బెయిల్

Updated : 12 Jun 2021 11:50 IST

డొమినికా: పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు మెహుల్‌ ఛోక్సీకి డొమినికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను అక్కడి హైకోర్టు తిరస్కరించింది. ఫ్లైట్‌ రిస్క్‌ కారణాలతో ఆయనకు బెయిల్‌ ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే మెహుల్ ఛోక్సీకి డొమినికాతో ఎలాంటి సంబంధాలు లేవని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో తాను తప్పించుకోబోనని ఛోక్సీ కోర్టుకు హామీ ఇచ్చేలా అతనిపై న్యాయస్థానం ఎలాంటి షరతులు విధించలేదని తెలిపింది.

పైగా పిటిషన్‌లో మెహుల్‌ ఛోక్సీ.. తన సోదరుడు ఉన్న హోటల్లో ఉంటానని పేర్కొనడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓ కచ్చితమైన చిరునామా లేని హోటల్లో ఉంటానని ఎలా హామీ ఇవ్వగలడని ప్రశ్నించింది. పిటిషన్‌లో ఛోక్సీ ఎలాంటి బలమైన హామీ ఇవ్వలేకపోయాడని తెలిపింది. పైగా ఇంకా కోర్టులో విచారణ కూడా ప్రారంభం కాలేదని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నామని తెలిపింది. ఛోక్సీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. దేశం విడిచి వెళ్లే అవకాశం లేదని అతని కుటుంబ సభ్యులు తెలిపినప్పటికీ.. కోర్టు వారి వాదనను పరిగణనలోకి తీసుకోలేదు.

వజ్రాల వ్యాపారి, రూ.13,500 కోట్లు విలువ చేసే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన మెహుల్ ఛోక్సీని డొమినికా ప్రధాని రూజ్​వెల్ట్ స్కెర్రిట్ భారతీయుడు అని సంబోధించిన విషయం తెలిసిందే. ఛోక్సీ భవిష్యత్తేంటో కోర్టులే తేలుస్తాయని వ్యాఖ్యానించారు. దీంతో డొమినికా ప్రభుత్వం భారత్‌కు సహకరించేందుకు సిద్ధమైనట్లు స్పష్టమైంది. మరోవైపు ఛోక్సీని భారత్​కు పంపించాలన్న పిటిషన్​పై విచారణను డొమినికా కోర్టు వాయిదా వేసింది. దీంతో ఛోక్సీకి ఓ రకంగా తాత్కాలిక ఉపశమనం లభించినట్లయింది. 

మే 23న ఆంటిగ్వాలో అదృశ్యమైన చోక్సీ.. కొద్దిరోజులకు డొమినికాలో ప్రత్యక్షమయ్యారు. చోక్సీని ఎవరో అపహరించి డొమినికాకు తీసుకొచ్చారని ఆయన తరఫు న్యాయవాది వాదిస్తుండగా.. అక్రమంగానే ప్రవేశించారని అక్కడి పోలీసులు చెబుతున్నారు. అక్కడి నుంచి క్యూబాకు పారిపోయే యోచనలో ఉండగానే ఛోక్సీ పోలీసులకు చిక్కాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని