Odisha Train Accident: మృతుల్ని గుర్తించేందుకు కృత్రిమ మేధ

ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొట్టిన ప్రమాద ఘటనలో గుర్తింపునకు నోచుకోని మృతుల విషయంలో అధునాతన సాంకేతికతపై రైల్వేశాఖ ఆధారపడుతోంది.

Updated : 08 Jun 2023 09:27 IST

45 మంది విషయంలో కచ్చితమైన సమాచారం
కీలకంగా ‘సంచార్‌ సా’ పోర్టల్‌ సేవలు
సిమ్‌ల ద్వారా దొరికిన ఆచూకీ

దిల్లీ: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొట్టిన ప్రమాద ఘటనలో గుర్తింపునకు నోచుకోని మృతుల విషయంలో అధునాతన సాంకేతికతపై రైల్వేశాఖ ఆధారపడుతోంది. వేలిముద్రలు, సిమ్‌కార్డులు సహా సాంకేతికంగా ఏ చిన్న ఆధారం లభ్యమైనా మృతదేహాలను ఆయా కుటుంబాలవారికి అప్పగించాలని ప్రయత్నాలు చేస్తోంది. 288 మంది మృతుల్లో 83 మంది గుర్తింపు ఇంతవరకు పూర్తికాలేదు. మృతుల వేలిముద్రలు సేకరించి, వారి ఆధార్‌ వివరాల ద్వారా కుటుంబ సభ్యుల గురించి తెలుసుకునేందుకు ‘విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (ఉడాయ్‌) బృందాన్ని బాలేశ్వర్‌కు పిలిపించాలని తొలుత భావించారు. చాలామంది చేతుల వేళ్లు బాగా దెబ్బతినడంతో అది ఫలించలేదు. దీంతో కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే సంచార్‌ సాథీ పోర్టల్‌ను ఉపయోగిస్తున్నారు. 64 మృతదేహాల విషయంలో ఈ పోర్టల్‌పై ఆధారపడగా 45 కేసుల్ని విజయవంతంగా గుర్తించగలిగింది. వినియోగదారులు తమ పేరుపై ఎన్ని సిమ్‌కార్డులు జారీ అయ్యాయో తెలుసుకునేందుకు, పోగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్లను బ్లాక్‌ చేసేందుకు ఈ వెబ్‌సైట్‌ను ఉద్దేశించిన విషయం తెలిసిందే. ఐటీ శాఖకూ మంత్రిగా ఉన్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవే దీనిని ఇటీవల ప్రారంభించారు. మృతుల ఫొటోల ఆధారంగా వారి ఫోన్‌ నంబర్లు, ఆధార్‌ వివరాలను ఈ పోర్టల్‌ సమకూర్చింది. వీటి ఆధారంగా కుటుంబ సభ్యుల్ని సంప్రదించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందు అక్కడి సెల్‌ఫోన్‌ టవర్ల ద్వారా ఏయే కాల్స్‌ వెళ్లాయో తెలుసుకుని, ఆ తర్వాత ఆగిపోయిన ఫోన్లతో ఆ వివరాలను క్రోడీకరించే ప్రయత్నం చేస్తున్నారు.

గ్రీస్‌లో ఐదువారాలు పట్టిన పని ఇక్కడ 51 గంటల్లోనే

కోరమండల్‌ దుర్ఘటన జరిగాక అక్కడ తీవ్రంగా దెబ్బతిన్న రైలు మార్గాన్ని 51 గంటల్లోనే పునరుద్ధరించిన విషయం తెలిసిందే. దీనికోసం మంత్రిత్వ శాఖ ఎనిమిది బృందాలను నియమించింది. ఒక్కోదానిలో 70 మంది ఉన్నారు. నాలుగు బృందాలకు డీఆర్‌ఎంలు, మరో నాలుగు బృందాలకు జీఎంలు నేతృత్వం వహించారు. ఐదు కెమెరాలు నిరంతరం ప్రత్యక్ష ప్రసారాన్ని దిల్లీలోని రైల్‌భవన్‌కు అందించాయి. ఈ సమన్వయం వల్లనే రికార్డు సమయంలో రైళ్ల రాకపోకల్ని పునరుద్ధరించగలిగామని అధికార వర్గాలు తెలిపాయి. 2022లో జర్మనీలోని హనోవెర్‌లో రెండు గూడ్సురైళ్లు ఢీకొంటే పునరుద్ధరణకు 24 రోజులు పట్టిందనీ, గ్రీస్‌లో ఒక ప్రయాణికుల రైలు..గూడ్సురైలు ఢీకొంటే ఐదువారాల తర్వాతే అక్కడ మళ్లీ రైళ్లు నడిచాయనీ గుర్తుచేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని