Piyush Jain: నోట్ల గుట్టలను పట్టించిన పొగాకు, పాన్‌ మసాలా..!

‘నల్లధన కుబేరుడు’ పీయూష్‌ జైన్‌ పన్ను ఎగవేత వ్యవహారం ఉత్తరప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆయన ఇంట్లో కన్పంచిన నోట్ల గుట్టలను చూసి

Published : 29 Dec 2021 01:45 IST

పీయూష్‌ జైన్‌ ఉదంతం వెలుగులోకి వచ్చిందిలా..

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘నల్లధన కుబేరుడు’ పీయూష్‌ జైన్‌ పన్ను ఎగవేత వ్యవహారం ఉత్తరప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆయన ఇంట్లో బయటపడిన నోట్ల గుట్టలను చూసి అధికారులే నోరెళ్లబెట్టారు. బ్యాంకు అధికారులు నాలుగు రోజులు కూర్చుని 20 కౌంటింగ్‌ మిషన్లతో కుస్తీపడితే రూ.257కోట్లుగా లెక్క తేలింది. దేశంలోనే ఇప్పటివరకూ దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్న అత్యంత విలువైన నగదు ఇదే కావడం గమనార్హం. మరి ఈ ఘరానా మోసం ఎలా బయటపడింది..? తప్పుడు బిల్లులతో పన్ను ఎగవేతకు పాల్పడిన పీయూష్‌ కూడబెట్టిన సొమ్మును అధికారులు ఎలా పట్టుకున్నారు..? అన్న విషయాలను డెరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌(డీజీజీఐ) అధికారులు తాజాగా వెల్లడించారు. 

పొగాకు ట్రక్కుల తీగ లాగితే..

కొద్ది రోజుల క్రితం కాన్పుర్‌లో జీఎస్‌టీ చెల్లించకుండా సరఫరా చేస్తోన్న , నాలుగు పొగాకు, పాన్‌ మసాలా ట్రక్కులను డీజీజీఐ అధికారులు గుర్తించారు. ఈ ట్రక్కులు గణపతి రోడ్‌ క్యారియర్‌కు చెందినవి. ఈ కేసు విచారణలో భాగంగా అధికారులు శిఖర్‌ పాన్‌ మసాలా ఫ్యాక్టరీకి వెళ్లారు. అక్కడ గణపతి రోడ్‌ క్యారియర్‌ పేరుతో దాదాపు 200లకు పైగా నకిలీ ఇన్‌వాయిస్‌లను అధికారులు గుర్తించారు. దీనిపై శిఖర్‌ పాన్‌ మసాలా కంపెనీ యాజమాన్యాన్ని విచారించగా.. పన్ను చెల్లించలేదని వారు అంగీకరించారు. అప్పటికప్పుడు రూ.3.09కోట్లను కూడా డిపాజిట్ చేశారు. అదే సమయంలో శిఖర్‌ పాన్‌ మసాలాలో ఒడోకామ్‌ ఇండస్ట్రీస్‌ వాటాలు ఉన్నట్లు తెలిసింది. అప్పుడే పీయూష్‌ జైన్‌ పేరు బయటికొచ్చింది.

బీరువాలో భద్రంగా సర్ది..

ఒడోకామ్‌ ఇండస్ట్రీస్‌కు పీయూష్‌ జైన్‌ యజమాని. నకలీ ఇన్‌వాయిస్‌లు, ఈ-వే బిల్లుల ద్వారా ఈ రెండు కంపెనీలు తమ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో వెంటనే అధికారులు ఓడోకామ్‌ రిజిస్ట్రర్డ్‌ అడ్రస్‌ అయిన పీయూష్‌ ఇంటికి వెళ్లారు. తనిఖీలు చేస్తుండగా ఆయన ఇంట్లో మూడు నోట్ల లెక్కింపు యంత్రాలు, రెండు అల్మారాలను గుర్తించారు. ఆ అల్మారాలను తెరిచి చూడగా.. అందులో నీట్‌గా ప్యాక్‌ చేసిన నోట్ల కట్టలు కన్పించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు.. అక్కడే లెక్కింపు చేపట్టారు. ఇందుకోసం ఎస్‌బీఐ అధికారులను పిలిపించారు. వీరంతా నాలుగు రోజుల పాటు 20 కౌంటింగ్‌ మిషన్లతో లెక్క బెట్టగా.. మొత్తం విలువ రూ.257 కోట్లుగా తేలింది. ఇందులో రూ.177.45కోట్లు లెక్కల్లో చూపని సొమ్ముగా తేల్చారు. దీంతో పాటు 23 కిలోల బంగారం, 250 కిలోల వెండి, రహస్యంగా దాచిన 600 కిలోల గంధపు చెక్కల నూనెను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

పాత స్కూటర్‌, పాత కార్లలో తిరుగుతూనే..

కాన్పుర్‌కు చెందిన పీయూష్‌ జైన్‌ గత 20ఏళ్లుగా సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నాడు. యూపీతో పాటు ముంబయి, గుజరాత్‌లలోనూ ఆయనకు బిజినెస్‌లు ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి కోట్లలో ఆదాయం వస్తుంది. అయినప్పటికీ పీయూష్‌ మాత్రం సాదాసీదాగానే ఉంటారని స్థానికులు చెబుతున్నారు. తన ఇంటి ముందు టయోటా క్వాలిస్‌, మారుతి వంటి రెండు పాత మోడల్‌ కార్లు పార్క్‌ చేసి ఉంటాయట. ఇక తన పూర్వీకుల ఊరు కన్నౌజ్‌కు ఎప్పుడు వెళ్లినా పాత బజాజ్‌ ప్రియ స్కూటర్‌పైనే తిరుగుతారని స్థానికులు తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని