అత్యంత కనిష్ఠానికి ఇంధన వినియోగం!

గడిచిన ఐదు నెలలతో పోలిస్తే ఫిబ్రవరిలో ఇంధన డిమాండ్‌ అత్యంత కనిష్ఠాన్ని నమోదు చేసింది. గత సెప్టెంబర్‌ నుంచి దేశంలో పెట్రో ధరలు మండిపోతుండగా అప్పటినుంచి చమురు డిమాండ్‌ తగ్గుతోంది....

Published : 13 Mar 2021 01:22 IST

దిల్లీ: గడిచిన ఐదు నెలలతో పోలిస్తే ఫిబ్రవరిలో ఇంధన డిమాండ్‌ అత్యంత కనిష్ఠాన్ని నమోదు చేసింది. గత సెప్టెంబర్‌ నుంచి దేశంలో పెట్రో ధరలు మండిపోతుండగా అప్పటినుంచి చమురు డిమాండ్‌ తగ్గుతోంది. ఈ ఏడాది జనవరిలో కనిష్ఠానికి పడిపోగా ఫిబ్రవరిలో డిమాండ్‌ ఇంకాస్త తగ్గిపోయింది. పెట్రోలియం శాఖ అనుబంధ సంస్థ పీపీఏసీ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గతేడాదితో పోలిస్తే ఈ ఫిబ్రవరిలో వినియోగం 4.9 శాతం మేర తగ్గి 17.02 మిలియన్‌ టన్నులకు దిగివచ్చింది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో 4.6 శాతం మేర వినియోగంలో తగ్గుదల కనిపించింది. ఇంధన ధరల్లో క్షీణత సహా కరోనా తగ్గుముఖం పడితే అసలు వినియోగం ఎంత ఉందో తెలిసొచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఇంధన ఉత్పత్తుల దిగుమతిదారు అయిన భారత్‌లో చమురు ధరలు ఎన్నడూ లేని విధంగా రికార్డు ధరలకు చేరుకున్నాయి. డీజిల్‌ వినియోగం ఎంత పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థ అంతగా ఉరకలు పెట్టడం సాధారణం కాగా, గత నెలలో డీజిల్‌ వినియోగం 3.8 శాతం మేర క్షీణించింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 8.5 శాతం మేర తగ్గినట్లు పీపీఎస్సీ తెలిపింది. పెట్రో విక్రయాలు కూడా 6.5 శాతం మేర తగ్గాయి. అయితే వంట గ్యాస్‌ వినియోగం మాత్రం గడిచిన సంవత్సరంతో పోలిస్తే 7.6 శాతం మేర పెరిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని