IndiGo: భార్య ఎక్కిన ఫ్లైట్ ఆలస్యమంటూ ట్వీట్‌.. స్పందించిన ఇండిగో

విమానం ఆలస్యంపై ఓ నెటిజన్ ట్వీట్‌  చేయగా.. ఇండిగో(IndiGo) సంస్థ స్పందించింది. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

Published : 03 Jul 2023 23:56 IST

దేహ్రాదూన్‌: పైలట్ అలసిపోవడం వల్లే తన భార్య వెళ్లాల్సిన విమానం మూడు గంటలు ఆలస్యమైందని దేశీయ విమానయాన సంస్థ ఇండిగో(IndiGo)పై ఓ వ్యక్తి అసహనం వ్యక్తం చేశారు. విమానం ఆలస్యం గురించి తన భార్య చేసిన వాట్సాప్‌ చాటింగ్‌ను అతడు ట్విటర్‌లో చేశారు. ఈ ట్వీట్స్ వైరల్‌గా మారడంతో ఇండిగో స్పందించింది. ఆదివారం దేహ్రాదూన్‌-చెన్నై( Dehradun-Chennai)  విమానంలో ఈ ఘటన జరిగింది. 

సమీర్‌ మోహన్ అనే వ్యక్తి ఆ ట్వీట్లు చేశారు. తన భార్యకు కలిగిన అసౌకర్యం గురించి వెల్లడించి, పౌరవిమానయాన శాఖకు ట్యాగ్ చేశారు. పైలట్ అలసిపోయాడని, అతడి స్థానాన్ని భర్తీ చేసే మరో సిబ్బంది లేకపోవడం వల్లే ఇలా జరిగిందని సమీర్‌ ట్వీట్లను బట్టి తెలుస్తోంది. అదే విమానంలో ప్రయాణించిన మరో వ్యక్తి.. విమానం లోపలి వీడియోను షేర్ చేశారు. ‘పైలట్స్‌ విమానాన్ని దిల్లీలో ల్యాండ్ చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. సిబ్బంది చాలా అలసిపోయి ఉన్నారు’ అని విమానాల నిర్వహణ విషయంలో ఇండిగో(IndiGo)పై విమర్శలు చేశారు. దీనిపై సంస్థ స్పందించింది. 

‘ఆలస్యం వల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. అనుకున్న విధంగా గమ్యస్థానాలకు చేరుకోలేకపోతే.. ఎదురయ్యే ఇబ్బందులు ఏంటో మేం అర్థం చేసుకోగలం. షెడ్యూల్ సమస్యల కారణంగా ఈ ఆలస్యం జరిగింది. ఈ సమయంలో ఓపిగ్గా ఉన్నందుకు కృతజ్ఞతలు’ అని  విమానయాన సంస్థ వెల్లడించింది. అలాగే ప్రయాణికులు సాధ్యమైనంత త్వరగా గమ్యస్థానాలు చేరుకునేందుకు చర్యలు చేపట్టామని తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు