Sheena Bora: షీనా బోరా బతికే ఉందట.. హత్య కేసులో సంచలన ట్విస్ట్‌

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో సంచలన ట్విస్ట్‌..! తన కుమార్తె బతికే ఉందంటూ షీనా తండ్రి ఇంద్రాణీ ముఖర్జీ సీబీఐకి తాజాగా లేఖ రాసిందట.

Updated : 16 Dec 2021 15:49 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ట్విస్ట్‌ వెలుగు చూసింది..! తన కుమార్తె బతికే ఉందంటూ షీనా తల్లి ఇంద్రాణీ ముఖర్జీ సీబీఐకి తాజాగా లేఖ రాసిందట. దీనిపై దర్యాప్తు చేయాలని ఆమె సీబీఐని కోరిందట. అంతేగాక, ఈ విషయంపై ఇంద్రాణీ ప్రత్యేక సీబీఐ కోర్టులో పిటిషన్‌ కూడా వేసిందని, త్వరలోనే న్యాయస్థానం దీన్ని విచారణ చేపట్టనున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

షీనా బోరా హత్య కేసులో అరెస్టయిన ఇంద్రాణీ 2015 నుంచి ముంబయిలోని బైకుల్లా జైలులో ఉంటోన్న విషయం తెలిసిందే. ఇటీవల జైల్లో ఓ మహిళా ఖైదీ తనను కలిసిందని, షీనాను ఆమె కశ్మీర్‌లో చూసినట్లు తనకు చెప్పిందని ఇంద్రాణీ ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. షీనా కోసం కశ్మీర్‌లో గాలించాలని ఆమె దర్యాప్తు సంస్థను కోరినట్లు సదరు కథనాలు తెలిపాయి. అయితే, దీనిపై ఇంద్రాణీ న్యాయవాదిని సంప్రదించగా.. ఆ లేఖను నేరుగా సీబీఐకే పంపించారని, అందులో ఏముందో తనకు కూడా పూర్తిగా తెలియదని చెప్పారు. 

ఏంటీ షీనా బోరా హత్య కేసు..

2012లో షీనా బోరా హత్య జరగ్గా.. మూడేళ్ల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో ఇంద్రాణీ ముఖర్జీ డ్రైవర్‌ శ్యామ్‌ రాయ్‌ అరెస్టయ్యాడు. అతడిని విచారిస్తున్న క్రమంలో.. 2012లో షీనాను ఇంద్రాణీ గొంతు నులిమి హత్యచేశారని చెప్పాడు. అంతేగాక, ఇంద్రాణీ ఆమెను తన చెల్లిగా పరిచయం చేసినట్లు తెలిపాడు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ముమ్మరంగా దర్యాప్తు చేయగా షీనా.. ఇంద్రాణీ ముఖర్జీ కుమార్తేనని తేలింది. దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం..

ఇంద్రాణీ మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత తన కుమార్తె షీనా, కుమారుడు మైఖెల్‌ను గువాహటిలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంచేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు సంజీవ్‌ ఖన్నా అనే వ్యక్తిని వివాహం చేసుకుని అతడి నుంచి కూడా విడిపోయింది. తర్వాత ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్‌ పీటర్‌ ముఖర్జీని వివాహం చేసుకొంది. పెద్దయ్యాక తల్లి గురించి తెలుసుకున్న షీనా.. ముంబయికి వెళ్లి ఇంద్రాణీని కలిసింది. అయితే, ఇంద్రాణీ మాత్రం షీనాను అందరికీ చెల్లిగా పరిచయం చేసింది. 

ఈ క్రమంలోనే పీటర్‌ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌ ముఖర్జీతో షీనాకు పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారితీసింది. అదే సమయంలో షీనా.. ఇంద్రాణీ మధ్య ఆర్థిక విభేదాలు తలెత్తాయి. దీంతో షీనా తల్లిని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టింది. దీంతో విసిగిపోయిన ఇంద్రాణీ.. తన రెండో భర్త సంజీవ్‌, డ్రైవర్‌ శ్యామ్‌ రాయ్‌ సాయంతో షీనాను గొంతునులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని రాయ్‌గఢ్‌లోని ఓ అటవీ ప్రాంతంలో దహనం చేసినట్లు తెలిసింది. 

2015లో ఈ విషయం వెలుగులోకి రాగా.. పోలీసులు ఆ అటవీ ప్రాంతానికి వెళ్లి షీనా అవశేషాలను స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఇంద్రాణీ మాత్రం వాటిని కొట్టిపారేసింది. ఈ కేసులో ఇంద్రాణీ, సంజీవ్‌లతో పాటు పీటర్‌ ముఖర్జీని కూడా అరెస్టు చేశారు. అయితే జైల్లోనే ఇంద్రాణీ - పీటర్‌ల వివాహ బంధానికి ముగింపు పడింది. 2019లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. గతేడాది పీటర్‌ బెయిల్‌పై విడుదలయ్యారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని